బాల్క సుమన్ హంతకుడు.!కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామన్న జగ్గారెడ్డి.!
హైదరాబాద్ : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. వచ్చే నెల ఏడో తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటన పట్ల బాల్క సుమన్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బాల్క సుమన్ తన గడ్డంలో ఉన్న ఒక వెంట్రుకతో సమానమన్నారు జగ్గారెడ్డి. అంతే కాకుండా ఉద్యమ సమయంలో విద్యార్థులను బాల్క సుమన్ చంపిన అంశం తనవద్ద కొందరు వ్యక్తులు ప్రస్తావించినట్టు జగ్గారెడ్డి గుర్తు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులపై విచారణ జరిపిస్తామని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వరా.?టీఆర్ఎస్ నేతలు వీసీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న జగ్గారెడ్డి
అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటన అనుమతిపై వైస్ ఛాన్సలర్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని, ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో తమకు అర్దం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీకి కూడా అనుమతి ఇవ్వరా? అని ప్రశ్నించారు. యూనివర్సిటీ వీసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు కూడా అనుమతి ఇవ్వొద్దని చెప్తున్నారని, వీసిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు.
వీసి స్పందించాలి.. అనుమతి ఇవ్వకపోతే కార్యచరణ ఉంటుందన్న జగ్గన్న
ఒక ప్రముఖ యూనివర్సిటీ వీసీకే గులాబీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారని, వైస్ ఛాన్సలర్ అంటే డమ్మీ పోస్టు కాదన్నారు జగ్గారెడ్డి. వీసీ నామమాత్రపు పదవైతే తమకు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీ పర్యటన నిమిత్తం అనుమతి కోసం ఐదు రోజులు అవసరమా అన్నారు. వీసి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని, వీసీ అనుమతి ఇస్తే సంతోషమని, ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ నెల 31 న విద్యార్ధి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణ తీసుకుంటామన్నారు వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి.
బాల్క సుమన్ హంతకుడన్న సమాచారం ఉంది.. విచారణ జరిపిస్తామన్న జగ్గారెడ్డి..
ఇదిలా ఉండగా బాల్క సుమన్ కి తెలివి ఉందో, లేదో తెలియదని, అయన రాజకీయ నాయకుడిగా తన గడ్డంలో వెంట్రుకకి కూడా పనికిరాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను సుమన్ చంపినట్టు నాకు కొన్ని లేఖలు వచ్చాయని, చంపిన తర్వాత, ఆ డెడ్ బాడీ చేతులతో లేఖలు రాసి పెట్టారని ఇదంతా సుమన్ పర్యవేక్షణలో జరిగిందని కొందరు తనకు సమాచారం ఇచ్చారని జగ్గారెడ్డి బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమన్ పై విచారణ ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు జగ్గారెడ్డి.
కేసీఆర్ కు రాహుల్ పట్ల గౌరవం ఉందా.?అనుమతి అంశంలో తేలిపోతుందన్న జగ్గారెడ్డి
సీఎం చంద్రశేఖర్ రావుకు రాహుల్ గాంధీ పట్ల గౌరవం ఉంటే అనుమతి అదే వస్తుందన్నారు జగ్గారెడ్డి. పోలీసులు కూడా ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు చేతగాని వాళ్ళకింద జమకట్టడం టీఆర్ఎస్ నేతలకు మంచిది కాదన్నారు జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని, అప్పుడు అందరి ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్తామనన్నారు జగ్గారెడ్డి. యూనివర్సిటీ గులాబీ నాయకుల సొంత జాగీరు కాదన్నారు. గాంధీభవన్ లో జగ్గారెడ్డి తో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమురి వెంకట్, ఓయూ జీఏసీ నేతలు కొటూరి మానవతా రాయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.