చర్చలు సఫలం: సోమవారం నుంచి క్లాసులకు బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్: మంత్రి ఇంద్రకరణ్
సమస్యలపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కదం తొక్కిన సంగతి తెలిసిందే. సమస్యలు పరిష్కరించాలని కోరడంతో.. ప్రభుత్వం చర్చలు జరిపింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకట రమణ బృందం చర్చలు జరిపింది. విద్యార్థులతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఐకే రెడ్డి తెలియజేశారు.

చర్చలు సఫలం..
ఆర్జీయూకేటీ విద్యార్థులతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వివరించారు. విద్యార్థుల డిమాండ్లను ఒప్పుకున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల డిమాండ్లు అన్నీ పరిష్కరించదగినవే అని చెప్పారు. సోమవారం నుంచి క్లాస్లకు హాజరవుతామని విద్యార్థులు తమతో చెప్పారని పేర్కొన్నారు. విద్యార్థులకు మంత్రులు కేటీఆర్, సబిత కూడా భరోసా ఇస్తారని, ఆర్జీయూకేటీ వీసీ నియామకంపై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు. ఆ ఇబ్బందులను విద్యార్థులకు వివరించామని, ఆర్జీయూకేటీకి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

నివేదిక ఇలా
విద్యార్థుల సమస్యలపై మంత్రికి డైరెక్టర్ ప్రొ. సతీష్కుమార్ నివేదిక ఇచ్చారు. విద్యార్థులు తమ సమస్యలను ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ 12 డిమాండ్లు తీర్చాల్సిందేనని విద్యార్థుల పట్టుపట్టారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంపై పీఠముడి పడింది. చర్చలకు సహకరించాలని విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

కరెంట్, నీరు బంద్
బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. దారికి తెచ్చుకునేందుకు విద్యుత్, మంచినీటి సరఫరా బంద్ చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు మరింత పట్టుదలతో ఆందోళన నిర్వహించడంతో ఆ సౌకర్యాలను అధికారులు పునరుద్ధరించక తప్పలేదు. వర్సిటీలో రెగ్యులర్ వీసీ నియామకమే తమ ప్రధాన డిమాండ్ అని ఆందోళన కొనసాగించారు. వర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి తమ సమస్యలు విని.. పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. కానీ మంత్రి ఐకే రెడ్డి బృందం జరిపిన చర్చలు సత్పలితాలను ఇచ్చింది.












Click it and Unblock the Notifications