ఆరేళ్ల చిన్నారి అత్యాచార నిందితుడి మృతదేహం లభ్యం: రైల్వే ట్రాక్పై: చేతిపై ఆ గుర్తుతో
హైదరాబాద్: హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధారించినట్లు తెలుస్తోంది.
ఆ టాటూతో గుర్తించిన పోలీసులు
నిందితుడి కుడిచేతి మీద మౌనిక అనే పేరును టాటూగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీనితో మృతదేహం రాజుదేననే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా- రైల్వే ట్రాక్ పక్కన అతని మృతదేహం లభించడంతో.. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులు తనను ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో అతను రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నాయి. అతని మృతి మీద మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఎన్కౌంటర్ చేశారా?
పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. ఎన్కౌంటర్ చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరూ నిర్దారించట్లేదు. ఆత్మహత్య చేసుకోవడానికే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సమాజానికి, పోలీసులకు భయపడి అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
డీఎన్ఏ శాంపిళ్లు..
మృతదేహాన్ని తరలించిన తరువాత.. కొన్ని డీఎన్ఏ శాంపిళ్లను సేకరించారు పోలీసులు. వాటిని సైంటిఫిక్ వెరిఫికేషన్ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడి నుంచి నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదిక అందిన తరువాత- ఆ మృతేహం నిందితుడు రాజుదా? కాదా? అనే తుది నిర్ధారణ చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. ఈ నివేదిక ఇంకొన్ని గంటల్లో అందుతుందని పేర్కొన్నారు.
మధ్యాహ్నం ప్రెస్మీట్..
కాగా- పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ యాదవ్ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి నివేదిక అందిన వెంటనే- ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారని తెలుస్తోంది. సైదాబాద్ సింగరేణి కాలనీ ఉదంతం మీద ఆయన అన్ని వివరాలను వెల్లడిస్తారని సమాచారం. రాజును గాలించడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలను మొదలుకుని- అతని మృతదేహం లభించడం వరకు అన్ని విషయాలను సీపీ అంజన్ కుమార్ అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు.
1000 మంది పోలీసులతో
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, అనంతరం హత్యకు పాల్పడిన రాజును గాలించడానికి పోలీసులు 10 స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 1000 మంది పోలీసులతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట్, వరంగల్ వంటి జిల్లాల్లో విస్తృతంగా గాలించారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్నూ అప్రమత్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లను పోలీసులు అలర్ట్ చేశారు. అతి పెద్ద మ్యాన్ హంట్గా గుర్తింపు పొందింది. ఆటోల వెనుక, ఆర్టీసీ బస్సుల్లో అతని ఫొటోలను అతికించారు.
రాజకీయ ప్రకంపనలు..
సైదాబాద్ సింగరేణి కాలనీ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ స్థాయిలో రాజకీయ ప్రకంపనలను సృష్టించిందో తెలుసు. బాధిత కుటుంబాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. నైతికంగా అండగా నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, నటుడు మంచు మనోజ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వీరంతా ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం..
ఈ కేసును హైదరాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు రాజు కోసం విస్తృతంగా గాలించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మొదలుకుని చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెండ్లను అప్రమత్తం చేశారు. వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. రాజు ఎక్కడికీ తప్పించుకుని పారిపోకుండా అతని చుట్టూ ఓ కనిపించని వలయాన్ని పన్నారు. అతని కోసం పోలీసులు ఒకవంక గాలింపు చర్యలు కొనసాగిస్తుండగానే.. రైల్వే పట్టాల పక్కన మృతదేహం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
#AttentionPlease : The accused of "Child Sexual Molestation and murder @ Singareni Colony, found dead on the railway track, in the limits of #StationGhanpurPoliceStation.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 16, 2021
Declared after the verification of identification marks on deceased body. pic.twitter.com/qCPLG9dCCE