పంట రుణాలు కెసిఆర్కు వీజీ కాదు: వడ్డీ చెల్లిస్తేనే, పరిస్థితి ఇదీ...
పంటలు సాగు చేసే రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంతో కలిసి ఘనంగా పంట రుణాల ప్రణాళిక రూపొందించినా ఆచరణలో అది కాగితాలకే పరిమితమైందన్న ఆరోపణలు
హైదరాబాద్: పంటలు సాగు చేసే రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంతో కలిసి ఘనంగా పంట రుణాల ప్రణాళిక రూపొందించినా ఆచరణలో అది కాగితాలకే పరిమితమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో చేసిన అప్పులకు రాష్ట్ర ప్రభుత్వ రుణ మాఫీ వర్తించిన ఆ అప్పుపై వడ్డీ చెల్లిస్తేనే తాజాగా అప్పు చెల్లిస్తామని షరతు పెడుతున్నాయి. కొన్నిచోట్ల వయో వ్రుద్ధులకు రుణాలు మంజూరు చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో పెట్టుబడుల కోసం అన్నదాతలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళితే వారు మొహం చాటేస్తున్నారు. గతేడాది నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. మున్ముందు వడ్డీ వ్యాపారంపైనా కొరడా ఝుళిపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో రుణాలిచ్చేందుకు వారు వెనుకాడుతుండటంతో అన్నదాతలు తమ భార్యల ఆభరణాలు, పుస్తెల తాళ్లు కూడా తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
వ్యవసాయానికి 18 శాతం రుణాలివ్వాల్సిందే
రైతులకు 18 శాతం రుణాలివ్వాలని ఆర్బీఐ రూల్స్లో గొప్పగా రాసుకున్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా సరిగా రుణమివ్వట్లేదు. గత రుణ ప్రణాళికలు కాగితాల్లోనే మూలుగుతున్నాయి. నాలుగు విడతల్లో రుణమాఫీ చేసినట్టు సర్కారు చెబుతున్నా అది బుక్ అడ్జెస్ట్మెంట్లకు పోనూ రైతులకు మిగిలేది శూన్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ వూపందుకుంటున్నది. అనువైన వాతావరణంతో పత్తి సాగు అంచనాలు దాటిపోయేలా ఉంది. మరోవైపు వరి నాట్లు జోరందుకున్నాయి. ఇతర పంటల సాగుకు అవసరమైన పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. అంతా బాగున్నా అవసరమైన డబ్బు చేతిలో లేక అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో రుణాలు అందడం లేదు. అయిదెకరాల రైతుకు ఎకరానికి అవసరమైన రుణాన్ని బ్యాంకులు ఇవ్వడం లేదు. అరకొరగా అందే రుణం సరిపోకపోవడంతో ప్రైవేట్ అప్పుల కోసం అన్నదాతలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
Recommended Video
రైతుల డిపాజిట్ల చెల్లింపునకూ బ్యాంకర్ల కొర్రీలు ఇలా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2017-18లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ.1660.85 కోట్లు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక నిర్దేశించారు. ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికే నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు బ్యాంకర్లు రైతులకు పంపిణీ చేసిన రుణాలు కేవలం రూ.156 కోట్లు మాత్రమే. కేవలం పది శాతం కూడా ఇవ్వలేదు. గతేడాది రబీ కాలంలో మంచిగా పంటలు పండటానికి తోడు ఈ ఏడాది ఆరంభం నుంచి వర్షాలు పడుతుండడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించారు. జిల్లాలో ముఖ్యమైన పంట పత్తి సాగు మరింతగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 60 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా ఇప్పటికే 45 వేల ఎకరాలను మించిపోయింది. ఈ పది రోజుల్లో మరో 15 నుంచి 20 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు పెడతారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది మంచి ధర పలకడం.. భూములు పత్తి పంటలకు అనుకూలంగా ఉండడంతో పత్తి వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.. విత్తనాల కొనుగోలు, తొలి దుక్కులకు చేతిలో ఉన్న నగదు ఖర్చైపోయింది. కలుపుతీత, ఎరువుల కొనుగోళ్లకు ప్రస్తుతం చేతిలో పైసా లేదు. దీంతో అప్పుల కోసం రోజు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు.
అప్పులిచ్చేందుకు వడ్డీ వ్యాపారులు వెనుకంజ
పంటల సాగు వ్యయంపై సాంకేతిక కమిటీ లెక్కల ప్రకారమే ఎకరా వరి సాగుకు రూ.28 వేల నుంచి రూ.30 వేల రుణం ఇవ్వాలి. మూడెకరాల రైతుకు ఆ లెక్కన రూ.90 వేలు అందాలి. కానీ బ్యాంకులు రూ.15 వేలు కూడా ఇవ్వడం లేదు. తగినంత నగదు లేదనే సాకుతో వచ్చిన వారిని త్వరగా పంపేయాలనే లక్ష్యంతో ఎంతోకొంత విదిల్చి వెనక్కు పంపుతున్నారు. ఈ కొంచెం మొత్తం దక్కించుకునేందుకు ఒక్కో రైతు బ్యాంకు చుట్టూ వారం నుంచి పది రోజుల పాటు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి రైతులకు సగటున దక్కింది కేవలం రూ.13 వేలు మాత్రమే. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు అందని సమయంలో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు అప్పులు తీసుకునే వారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల లావాదేవీలపై ఆంక్షలు విధించడం.. ప్రతి లావాదేవీపై నిఘా ఉన్నట్లు ప్రచారం సాగుతుండడంతో అప్పులు ఇచ్చేందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు జంకుతున్నారు. భవిష్యత్లో వడ్డీ వ్యాపారంపైనా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము నష్టపోతామనే భయంతో వడ్డీ వ్యాపారులు అప్పులు ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకోవడం మినహా గత్యంతరం కనిపించడం లేదు.
వనపర్తిలో వయో భారం సాకుతో ఎగనామం
బ్యాంకుల నుంచి రుణం పొందాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 70ఏళ్ల లోపున ఉండాలని వనపర్తి జిల్లాలోని బ్యాంకుల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన కాదని, ముందు నుంచీ ఈ నిబంధన ఉందని చెబుతున్నారు. జిల్లాలో 40 వేల వరకు వృద్ధ రైతులు ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం దాదాపు 1.20లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో 40 వేల మంది వరకు 70 ఏళ్లు ఆపై వయసున్న రైతులు ఉంటారని అంచనా. వయోధికులైన రైతుల పేర్ల మీదే పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. కాని వాస్తవంగా వారి కుమారులు వ్యవసాయం చేస్తున్నారు.
పంట రుణం కావాలంటే పట్టాదారు పాసుపుస్తకం, ఆర్వోఆర్లు చూపించాలి. గత ఏడాది వరకు 70 ఏళ్లున్నా రుణాలిచ్చిన బ్యాంకులు ఈ సంవత్సరం రుణాలివ్వలేమని తిరస్కరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక రైతులు నిరాశ చెందుతున్నారు. ఇంకా భూములు పంచుకోకుండా ఉమ్మడిగా ఉంటున్న కుటుంబాలలో కుటుంబ పెద్దమీదనే పొలం ఉంటుందని, అలాంటప్పుడు ఆయన వయసైపోయిందని, పంట రుణం ఇవ్వమంటే వ్యవసాయం చేసేదెలాగని వారి వారసులు వాపోతున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారి నుంచి నూటికి మూడు నుంచి ఆరు శాతం వరకు వడ్డీకి డబ్బు తీసుకుని పంటలకు పెట్టుబడిగా పెడుతున్నారు. పంట పండకపోతే ఎలాంటి బీమా ఉండదు. అసలుతోపాటు వడ్డీ భారం పెరిగి రైతు కుదేలవుతున్నాడు. కొందరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కమీషను ఏజెంట్ల వద్దా అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ఆనక తాము పండించిన పంటను వారికే అమ్ముతామన్న నిబంధనతో వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నారు.
వడ్డీ సహా పాత రుణాలు చెల్లిస్తేనే...
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని బ్యాంకర్లు వడ్డీతో సహా పూర్తి రుణం కడితేనే కొత్త అప్పు ఇస్తామంటూ బ్యాంకులు పెడుతున్నాయి. మరోవైపు రైతుల ధాన్యం డబ్బుల్ని కూడా బ్యాంకులు ఇంకా ఇవ్వలేదు. అంతిమంగా బ్యాంకుల్లో రుణం అందక.. పెట్టుబడుల కోసం చేతిల చిల్లిగవ్వ లేక అన్నదాతలు అగచాట్లు పడుతు న్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాలుగేండ్లుగా సరిగా రుణ ప్రణాళిక అమలు కావట్లేదు. 2013-14లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళిక 1800 కోట్లు. ఇచ్చింది 1665 కోట్లు. 2014-15లో రుణ ప్రణాళిక 2100 కోట్లు. 1796 కోట్లు ఇచ్చారు. 2015-16లో రుణ ప్రణాళిక 2700 కోట్లు. ఇచ్చింది 1786 కోట్లు. 2016-17లో రుణ ప్రణాళిక 3300 కోట్లు. ఇచ్చింది 1925 కోట్లు. ఇలా ఏ ఒక్క సంవత్సరం కూడా రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకో లేదు. గణాంకాలను చూస్తే లక్ష్యాన్ని బ్యాంకులు దరిదాపుల్లోకి చేరినట్టు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందింది మూడింట ఒక వంతు మాత్రమే.
మిగతాదంతా బుక్ అడ్జెస్ట్మెంట్ చేసి మమా అనిపిస్తున్నారు. 2013-14లో చూస్తే రూ.1800 కోట్లకు రైతుల చేతులకు అందిన రుణాలు రూ.600 కోట్ల లోపే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2017-18లో వ్యవసాయ రుణ ప్రణాళిక అంచనా 5,230కోట్లు. ఐదు జిల్లాల పరిధిలో 7,94,855 మంది రైతులు ఉన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 1.10 లక్షల మంది రైతులు ఉండగా 923.59 కోట్లు, రూరల్ జిల్లాలో 1,89,116 మంది రైతులు ఉండగా 1060 కోట్లు. జనగామ జిల్లాలో 1,56,607 మంది రైతులు ఉండగా 940.78 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 1.60 లక్షల మంది రైతులు ఉండగా 1101.72 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో 1,79, 132 మంది రైతులు ఉండగా 1188.25 కోట్ల రూపాయల రుణలక్ష్యం ప్రతిపాదించారు.
బ్యాంకులు లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 5,230 కోట్ల లక్ష్యంలో 3వేల కోట్లు ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తున్నది. గృహ నిర్మాణాలు, కార్లు, వ్యాపార వాణిజ్య సంస్థలకు ఇచ్చిన విధంగా రైతులకు రుణాలు ఇవ్వట్లేదు. బ్యాంకుల ఎదుట ధర్నాలు చేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
వడ్డీ చెల్లించలేక.. కొత్త అప్పు పొందలేక అన్నదాత అగచాట్లు
నాలుగు విడతలుగా ప్రభుత్వం రైతు అప్పుల్ని మాఫీ చేసింది. దీనివల్ల రైతు తీసుకున్న రుణాల్లో అసలు మాత్రమే జమైంది. వడ్డీ కాలేదు. ఇప్పుడు బ్యాంకులు కిరికిరి పెడుతున్నాయి. వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా అప్పులు ఇస్తామని చెబుతున్నాయి. రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామవాసి సత్తయ్య అనే రైతు తన భూమిపై రూ. 50 వేల అప్పు తీసుకున్నాడు. నాలుగేళ్లలో రూ. 18వేల వడ్డీ వేశారు. వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా అప్పు ఇస్తామంటున్నారు. వెంకటయ్య అనే రైతు రూ. 40వేలు అప్పు తీసుకోగా రూ. 14 వేల వడ్డీ వేశారు. యాదగిరి అనే రైతు రూ. 45వేల అప్పు తీసుకోగా రూ. 16 వేల వడ్డీ వేశారు.
ఇలా ప్రతి రైతు తీసుకున్న మొత్తంపై వడ్డీకి వడ్డీ వేశారు. ఈ వడ్డీ డబ్బులు చెల్లిస్తేనే కొత్తగా రుణాలిస్తామని బ్యాంకులు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రైతుల పరి స్థితి మింగలేక కక్కలేక అన్నట్టుంది. వడ్డీ డబ్బులు చెల్లించలేక కొత్త అప్పు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు ఇవ్వాలని బ్యాంకుల్ని ఆదేశించామని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాదా బైనామా ద్వారా కొత్తగా పాస్పుస్తకాలు జారీ చేశామని, బ్యాంకులు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని, కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడం మొదలు పెట్టాయని పూర్తిస్థాయిలో రుణాలు అందజేసేలా చూస్తామని పేర్కొన్నారు.