(ఫోటోలు): చాన్నాళ్లకు సచివాలయానికి కెసిఆర్, 'సికింద్రాబాద్' కొత్త తలనొప్పి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... చాలా రోజుల తర్వాత శనివారం నాడు సచివాలయానికి వచ్చారు. ఆయన సచివాలయానికి ఎక్కువసార్లు రాకపోవడంపై విపక్షాలు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెసిఆర్ చాన్నాళ్ల తర్వాత సచివాలయంలో కనిపించారు.
సికింద్రాబాద్ జిల్లాకు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారనే వార్తల నేపథ్యంలో... కొత్త జిల్లాల డిమాండ్లు పెరుగుతున్నాయి. జనగామ, సిద్దిపేట తదితర సిటీలను జిల్లాలుగా చేయాలని దీక్షలు చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ను కూడా జిల్లా చేయాలనే వాదన తెరపైకి వచ్చింది.
సికింద్రాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని 'సికింద్రాబాద్ జిల్లా ఉద్యమ కార్యాచరణ సమితి' శనివారం నాడు డిమాండ్ చేసింది. ఈ సమితిని నగులూరి కృష్ణ గౌడ్ అనే హైకోర్టు అడ్వోకేట్ ప్రారంభించారు. సికింద్రాబాద్ జిల్లా కోసం వచ్చే వారం నుంచి ఉద్యమం చేస్తామని, ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెప్పారు.
1960కు ముందు సికింద్రాబాద్ వేరుగా ఉండేదని, అనంతరం హైదరాబాదులో కలిసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నగరం పైన దృష్టి సారించాలన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.