కెసిఆర్! స్త్రీలతో దెబ్బలు తినొద్దు: ఎర్రబెల్లి, 'మత్తులో అఘాయిత్యాలు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళలతో దెబ్బలు తినవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం హెచ్చరించారు. ప్రభుత్వం చీప్ లిక్కర్ పాలసీని ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
ఆదాయం కోసమే ప్రజలను తాగుబోతులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసీఆర్ గీత కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. మద్యం పాలసీ పేరుతో రాష్ట్రం మొత్తాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
గుడుంబాను అరికట్టలేక చీప్ లిక్కర్ తెస్తున్నామని మంత్రి చెప్పడం విడ్డూరమన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం చీప్ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మరో టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. చీప్ లిక్కర్ విషయంలో వెనక్కి తగ్గకుంటే మహిళలు, గీత కార్మికులతో కలిసి ధర్నాలు చేస్తామన్నారు. త్వరలో బందుకు పిలుపునిస్తామన్నారు. మహిళలు కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.
చీప్ లిక్కర్ వెనక్కి తీసుకోవాల్సిందే: డికె అరుణ
ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న చీప్ లిక్కర్ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. పేద ప్రజల రక్తాన్ని పీల్చే విధంగా చీప్ లిక్కర్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విడ్డూరమన్నారు.
మద్యం మత్తులో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రమాదాలలో ఎక్కువ భాగం మద్యం సేవించడం వల్లనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడం కోసం పేదలను బలి చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం దీనిపై లోతుగా ఆలోచించాలన్నారు.
నిజాంను పొగిడితే జనం కొడతారు: మురళీ ధర రావు
నిజాం పాలన పైన చర్చించేందుకు బిజెపి సిద్దంగా ఉందని, చరిత్రను వక్రీకరించి నిజాంను పొగిడితే ప్రజలు కొడతారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వరంగల్ జిల్లాలో అన్నారు. నిజాంలాగే మళ్లీ జమీందారు వ్యవస్థకు ప్రాణం పోసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
దేశం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్కు, తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించబడిన తెరాసకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీగా, జేబు పార్టీలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ బంద్, అర్చకుల సమ్మెకు వైసిపి, బిజెపి మద్దతు
తమ డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ గత కొద్ది రోజులుగా అర్చకులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. గురువారం నాడు హైదరాబాద్ బందుకు పిలుపునిచ్చారు. కాగా, అర్చకుల సమ్మెకు వైయస్సార్ కాంగ్రెస్, బిజెపి మద్దతు పలికింది.