తలసాని సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట: పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా 8 మంది శాసనసభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. వీరి అనర్హతకు వేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన ఎనిమిది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెసు పార్టీకి చెందిన సంపత్ కుమార్ ఆ పిటిషన్లను స్వీకరించారు. ఆ ఆరుగురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆయా పార్టీలకు చెందిన నాయకులు స్పీకర్ మధుసూదనాచారిని ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులపై ఏ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై ఆలోచన చేయాలని హైకోర్టు స్పీకర్కు సూచన మాత్రమే చేసింది. స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోవడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.
స్పీకర్కు తాము ఆదేశాలు ఇవ్వలేమని, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని టిడిపి నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేపట్టారు. టిడిపి నుంచి ముగ్గురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఒక్కరు, కాంగ్రెసు పార్టీ నుంచి నలుగురు టిఆర్ఎస్లో చేరారు.