పెరిగిన చలి తీవ్రత: హైదరాబాద్లో దశాబ్ద కాలంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లగా మారిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్లోని బేగంపేటలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. సాధారణంగా బేగంపేటలో అక్టోబర్ నెలలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని అధికారులు వెల్లడించారు.
మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని అంచనా. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తెలంగాణలోనే అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, రానున్న రెండు రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి 19 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.