స్వామి గౌడ్పై దాడి: 'కుట్ర జరిగింది'; ఇవేం కొత్త కాదన్న జానారెడ్డి
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం పట్ల నిరసన వ్యక్తం చేసే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు దురుసుగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
Recommended Video

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన హెడ్ ఫోన్ పోడియం వైపు విసరడం.. అది కాస్త మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటిని గాయపర్చడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత జానారెడ్డి స్పందించారు.

అందుకే నిరసన..: జానారెడ్డి
గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలుపుతున్న సమయంలో.. పోలీసులు తమను దిగ్బంధం చేశారని జానారెడ్డి అన్నారు. నెట్టుతూ.. తమను బయటకు ఈడ్చేసే ప్రయత్నం చేశారన్నారు. ఆ క్రమంలో తాను కూర్చున్న టేబుల్ తనపై పడిందన్నారు. హామీల అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేకపోవడంతోనే తాము నిరసన చేశామని అన్నారు.

ఇదేం కొత్త కాదు..
సభలో తాను ఎవరినీ ఏమి అనలేదని, అధికార పార్టీ ప్రతిపక్ష హక్కులను కాలరాస్తోందని అన్నారు. అధికార పార్టీ తీరు పట్ల ఆవేదనతో.. ఆవేశంతోనే కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారని చెప్పారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇలాగే నిరసన తెలుపుతున్నారని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీలో గవర్నర్పై పేపర్లు, మైక్లు విసిరిన ఘటనలు కొత్తవికావని ఆయన గుర్తు చేశారు.

మద్యం తాగారని ఎలా చెబుతారు?
కొంతమంది కాంగ్రెస్ సభ్యులు మద్యం సేవించి సభలోకి వచ్చారన్న ఆరోపణలను జానారెడ్డి తప్పుపట్టారు. సభలోకి సభ్యులు మద్యం తాగి వచ్చాడని ఎలా చెబుతారని జానారెడ్డి ప్రశ్నించారు.
సభలో సభ్యుల దుష్ప్రవర్తనపై గనుక చర్యలు తీసుకుంటే.. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పటి స్పీకర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో పరిశీలించాలని జానారెడ్డి సూచించారు.

కుట్ర జరిగింది: జీవన్ రెడ్డి
సోమవారం ఉదయం అసెంబ్లీలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
సభలో నిరసన తెలిపితే సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తామని ఎల్పీ భేటీలో సీఎం ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర మొదటి పౌరుడు గవర్నర్ ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని, అలాంటి వ్యక్తి సభకు ఆలస్యంగా రావడమేంటని నిలదీశారు.

దాడి దృశ్యాలు విడుదల:
సోమవారం అసెంబ్లీలో స్వామిగౌడ్పై దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. దాడిని స్పీకర్ తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముగ్గురు లేదా నలుగురు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications