టీఆర్ఎస్లో కేసీఆర్ వ్యాఖ్యల కుదుపు... ఆ హెచ్చరికతో వాళ్లకు షాక్; అందరిలోనూ అంతర్మధనం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రగతి భవన్ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో సుమారు గంటన్నరపాటు ప్రసంగించిన సీఎం కేసీఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కలకలం గా మారాయి
ఎవరు బీజేపీకి టచ్ లో ఉన్నారో తనకు తెలుసన్న కేసీఆర్
టిఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు చారం. ఎవరైనా సీక్రెట్ గా ఎవరిని కలిసినా తనకు కచ్చితంగా తెలుస్తుందని పేర్కొన్న కెసిఆర్ ఆ తర్వాత తన యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఎమ్మెల్యేలు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఎవరికి సమాటచ్లో ఉంటున్నారు, ఏ ఫోన్ నెంబర్తో మాట్లాడుతున్నారు.. ఏ యాప్ లో మాట్లాడుతున్నారు అంటే అనేక విషయాలు తనకు తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని కూడా సమాచారం.
కేసీఆర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో కుదుపు
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో ఎవరెవరు బిజెపి నేతలకు టచ్లో ఉన్నారు అన్నదానిపై టిఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తమ ఫోన్ల పై నిఘా ఉందా? సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారా? కెసిఆర్ హెచ్చరికలు ఎవరి ఉద్దేశించి చేసినవి అని టిఆర్ఎస్ పార్టీలో నేతలలో అంతర్మధనం కొనసాగుతుంది.
పార్టీలో కుదుపు మొదలైంది. కేసీఆర్ మీటింగ్ వెనుక ఆంతర్యం ఇదేనా? బిజెపి నేతల ట్రాప్ లో పడొద్దని చెబుతున్నారా లేక బిజెపి నేతలకు టచ్లో ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతున్నారా? అన్న అంశంపైన కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.
కేసీఆర్ వ్యాఖ్యల వెనుక మతలబు అదేనా?
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కెసిఆర్ నిర్వహించిన కీలక మీటింగ్ లో భవిష్యత్ ఎన్నికలపైన సూచనలు చేయడమే కాకుండా, టిఆర్ఎస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన క్రమంలో కేసీఆర్ ఆందోళనలో ఉన్నారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే టెన్షన్ లో ఉన్నారా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడాలని ప్రయత్నం సాగిస్తున్న వేళ బిజెపికి చెక్ పెట్టడం కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వెళ్లాలని చెబుతున్న కేసీఆర్ అన్ని నియోజకవర్గాల పైనే తన దృష్టి ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు అన్నది తనకు ఎప్పటికప్పుడు తెలుస్తుందని చెప్పటం వెనుక వారిని కంట్రోల్ చేసే మతలబు ఉన్నట్టు కనిపిస్తుంది.
కేసీఆర్ వ్యాఖ్యలతో పక్క చూపులు చూసే వాళ్ళలో టెన్షన్
తానెప్పుడూ ఫోకస్ గానే పని చేస్తున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇలా చెప్తారని ఊహించని నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో టిఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు కనిపిస్తోంది. ముఖ్యంగా పక్క పార్టీల వైపు చూస్తున్న నేతలు దొరక్కుండా జాగ్రత్త పడడానికి రూట్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒకింత ఆందోళనలో ఉన్నారు.