దేశ ప్రజలను ఆకర్షించే.. కేసీఆర్ తొలి టార్గెట్ ఫిక్స్.. సక్సెస్ అవుతారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తో దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని, వచ్చే ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీతో తలపడటానికి ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే వ్యూహాలకు పదును పెడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఎటువంటి పథకాలను ఇస్తే తనకు మద్దతు ఇస్తారు అన్న దానిపైన బాగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటనలు చేశారు.
దేశ ప్రజలను ఆకర్షించే రెండు పథకాలను వెల్లడించిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ కు రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారవుతుందని, దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. దేశం మొత్తం రైతులకు 1.45 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్తు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే చేసి చూపిస్తాం.. మోడీకి హెచ్చరిక
అంతే కాదు దేశంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారమిస్తే దేశవ్యాప్తంగా దళిత బందు పథకాన్ని అమలు చేస్తామని, దేశంలో ఏటా 25 లక్షల మందికి 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు పథకాన్ని అందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఇక అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను ఆకట్టుకోవడం కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తామని, మోడీకి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా మంటూ కెసిఆర్ వెల్లడించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో, దళిత బంధు పేరుతో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులు, ఎస్సీలను టార్గెట్ చేస్తూ పథకాల ప్రకటన ..అందుకేనా?
రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే, ఎస్సీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ దళిత బంధు పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పుకునే కేసీఆర్, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని అందుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులను, దళితులను మొదట ఆకట్టుకునే పనిలో ఉన్నారు.
వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించటం కోసం కేసీఆర్ ప్రకటనలు
కేంద్రంపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకతను, అక్కడి కొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ తో తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏం చెప్తే ప్రజలు తనవైపు టర్న్ అవుతారో, సరిగ్గా అదే చెబుతూ కెసిఆర్ పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఈ ప్రయత్నంలో కేసీఆర్ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ముందుకు వెళ్తానని, వెనుదిరిగి చూసేది లేదని తేల్చి చెబుతున్నారు.