కేసీఆర్, హరీష్లపై కేసులేమయ్యాయి, దళితులం కాబట్టేనా..: మందకృష్ణ
హైదరాబాద్: ఎవరు అడ్డుకున్నా తమ దీక్ష, ఆగదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. దళితులం కాబట్టే తమపై కేసులు పెడుaతున్నారా అని ఆయన ప్రశ్నించారు.
భారతి సంస్మరణ సభ పెట్టకపోతే భాగుండేదని చాలామంది అంటున్నారని గుర్తు చేస్తూ తాము శాంతియుతంగా ర్యాలీ చేశామే తప్ప పోలీసులపై దాడులు చేయలేదని ఆయన చెప్పారు.
వారు విధ్వంసం చేయలేదా
మిలియన్ మార్చ్లో అంత విధ్వంసం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు , కోదండరామ్లను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు సమస్యల మీద హైదరాబాద్లో కాకుండా కరీంనగర్లో ధర్నా చేయాలా అని ఆయన అడిగారు.
వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి
ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులపై పెట్టిన 307కేసులు ఏమయ్యాయని అడిగారు. దళితులం కాబట్టే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము చేపట్టే ఉపవాస దీక్షకు అనుమతి కోరితే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.
అనుమతి ఇవ్వలేదు, చేసి తీరుతాం
ఇందిరాపార్కు, బాపూఘాట్ వద్ద అనుమతి కోరినా ఇవ్వలేదని, ఎవరు అడ్డుకున్నా తమ దీక్ష ఆగదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు అణచివేత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా చేసే ఉద్యమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం..
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఉపవాస దీక్ష చేస్తానని చెప్పారు. అయితే, దానికి పోలీసుల అనుమతి లభించలేదు. వర్గీరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.