జంట హత్యల కేసు: నయీం మేనకోడలు అరెస్టు, 9 కేసుల్లో పాత్ర
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు సాజిదా పహీన్ను మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జంటహత్యల కేసులో ఆమెను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్కు చెందిన బెస్తకిష్టయ్య, జోడు ఆంజనేయులును 2005 మార్చి 14న నయీం ముఠా కిడ్నాప్ చేసి 15న శ్రీశైలం అడువుల్లో హత్య చేసింది.
ఈ కేసులో నయీం కూడా పాల్గొన్నాడు. ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, తాజాగా ఇదే కేసులో నిందితురాలైన నయీం మేనకోడలు సాజీదాషహీన్ అలియాస్ తానియా (30)ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరో 9 కేసుల్లో తానియా నిందితురాలని తూప్రాన్ డీఎస్పీ చెప్పారు.

కాగా, నయీం చేతిలో హతమైన వారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. హత్యలకు కారణమైన 20 ఎకరాల భూమి అప్పగించాలంటూ తూప్రాన్లో వారు ర్యాలీ నిర్వహించారు. కాగా, నయీం కేసుల్లో ఆయా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలుకు రంగం సిద్ధమవుతోంది. గ్యాంగ్స్టర్ ఎనకౌంటర్ తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు వెలుగులోకి రావడంతో నయీంకు సహకరించిన రాజకీయ, పోలీస్ అధికారుల పేర్లూ బయటపడ్డాయి.
నయీంతో రాజకీయ నాయకులు, పోలీసుల సంబంధాలపై చార్జిషీట్లలో కోర్టులకు వివరించనున్నట్లు సమాచారం. సిట్ పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు డీజీపీ అన్ని అంశాల్ని పరిశీలించి చార్జిషీట్ దాఖలులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications