కక్ష సాధింపా?: ఆసుపత్రిలో పోలీసుల బెదిరింపులు.. నేరెళ్ల బాధితులపై మరో దారుణం?
నేరెళ్ల బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద వరుసగా జరుగుతున్న దాడులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి.
హైదరాబాద్: నేరెళ్ల బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద వరుసగా జరుగుతున్న దాడులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి.
నేరెళ్ల ఘటన: కెటిఆర్ ఇలా, కోర్టుకు అలా.. మరీ ఇంతగా..
ఇసుక లారీలు మనుషుల్ని గుద్ది చంపుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఆక్రోశంతో తిరగబడ్డ అమాయకుల్ని మాత్రం చిత్రహింసలు పాలుచేసిందన్న విమర్శలు మూటగట్టుకుంది. పోలీసుల థర్డ్ డిగ్రీతో బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవడం.. ఆఖరికి వారి వైద్య చికిత్సకు కూడా ప్రభుత్వమే అడ్డుపడుతుందన్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
బలవంతంగా డిశ్చార్జి:
నేరెళ్లలో ఇసుక లారీలను అదుపు చేయలేని ప్రభుత్వం అమాయకులైన వారి మీద మాత్రం తమ ప్రతాపం చూపించిందన్న ఆరోపణలున్నాయి. ఆఖరికి వారికి వైద్యం అందించే విషయంలోను ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపుతున్నట్లు కనిపించలేదు.
గురువారం నాడు నిమ్స్ ఆసుపత్రి నుంచి నేరెళ్ల బాధితులను బలవంతంగా డిశ్చార్జి చేయడం ఇందుకు నిదర్శనం. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నా వినకుండా.. వారిని బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో బాధితులంతా ఆసుపత్రి ప్రాంగణంలోనే నిరసనకు దిగారు.
బాధితుల ఆందోళన:
బాధితుల ఆందోళనకు మద్దతుగా మాజీ ఎంపీ వీహెచ్, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, అనిల్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ధర్నాకు దిగారు. ధర్నా అనంతరం బాధితులను బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
పోలీస్ బెదిరింపులు:
నిమ్స్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని పోలీసులు తమను హెచ్చరించారని నిమ్స్ బాధితులు ప్రజా సంఘాల వద్ద వాపోవడం గమనార్హం. బుధవారం ప్రజా సంఘాల జేఏసీ, అఖిలపక్షం నేతలు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా.. బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
బాధితులు ఏమన్నారు:
నేరెళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన బానయ్య, గోపాల్, హరీశ్, ఈశ్వర్, బాలరాజు, మహేశ్ అనే ఆరుగురు ప్రజా సంఘాలతో తమ బాధల్ని చెప్పుకున్నారు. బుధవారం నుంచి చికిత్స అందించిన వైద్యులు గురువారం రాత్రి బలవంతంగా డిశ్చార్జి చేశారని అన్నారు.
ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స అందించాలని ఎంత వేడుకున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.
మఫ్టీలో వచ్చి బెదిరించిన పోలీసులు:
నిమ్స్ ఆసుపత్రికి మఫ్టీలో వచ్చిన పోలీసులు తమ వివరాలను, ఫోటోలను తీసుకెళ్లారని బాధితులు చెప్పారు. పంజాగుట్ట సీఐ పోలీస్ సిబ్బందితో వచ్చి వెంటనే ఆసుపత్రి విడిచి వెళ్లాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారని ఆరోపించారు.
సెలైన్లు తొలగించి మరీ తమను బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆసుపత్రి నుంచి బలవంతంగా పంపించారన్న విషయం తెలియగానే ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు.
కేసీఆర్ సర్కార్ కక్ష:
పోలీసుల బెదిరింపులు, నిమ్స్ నుంచి బాధితులను వెళ్లగొట్టడాన్ని బట్టి చూస్తే కేసీఆర్ సర్కార్ నేరెళ్ల బాధితులపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరెళ్ల ఘటన ప్రభుత్వ ఇమేజ్కు భారీ గండి కొట్టడంతో.. బాధితులపై ప్రభుత్వం రగిలిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రహింసలు పాలు చేసిందే కాక.. ఇలా తమను వెంటాడి వేధిస్తుండటం బాధితులను క్షోభకు గురిచేస్తోంది.