బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్ఎస్ తీసుకోండి.. మాకేం అభ్యంతరం లేదు కేసీఆర్: రఘునందన్ రావు సెటైర్లు!!
అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ ప్రవర్తించిన తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రాజకీయ వేదికగా మార్చుకున్నారని, ఇది చాలా దురదృష్టకరమని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్, అసెంబ్లీ వేదికగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ మూడు భాషల్లో మాట్లాడారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసీఆర్ జాతీయ రాజకీయాలు చెయ్యటంపై తమకేమీ అభ్యంతరం లేదన్నారు.
మూడు తోకలు ఎలా అధికారంలోకి వస్తాయి? ప్రశ్నించిన రఘునందన్ రావు
జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు? బిఆర్ఎస్ పెట్టుకోండి, వీఆర్ఎస్ తీసుకోండి అంటూ పేర్కొన్నారు. ఆపై ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వాలని, అందులో మాకేం అభ్యంతరం లేదంటూ సెటైర్లు వేశారు. మూడు తోకలు ఎలా అధికారంలోకి వస్తాయి అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈరోజు, రేపు అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేశారని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల ఉద్దేశం కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేయడం అని, అంతకుమించి రాష్ట్రానికి చేసిందేమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భట్టి విక్రమార్కపై మండిపడిన రఘునందన్ రావు
ఇక ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, పరోక్ష మిత్రుడు కాంగ్రెస్ తో కలిసి టిఆర్ఎస్ పార్టీ కూడబలుక్కుని, వాళ్లకు వాళ్లే అసెంబ్లీలో మాట్లాడుకున్నారంటూ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రతిపక్షాలను గౌరవించటం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇక విద్యుత్ విషయంలో కేంద్రం పై మాట్లాడిన భట్టి విక్రమార్క రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.
మోటర్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో లేదు
2020లో విద్యుత్ సంస్కరణలు తెచ్చి 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని, అసలు పాస్ కాని బిల్లు కోసం అసెంబ్లీలో చర్చించడం దేనికని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. మాట్లాడే అవకాశం ఇస్తే కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతామని రఘునందన్ రావు తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఎక్కడా పేర్కొనలేదని రఘునందన్ రావు తెలిపారు.
సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి
సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేశాయని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దని కేంద్రం చెప్పలేదని పేర్కొన్న రఘునందన్ రావు, విద్యుత్ సవరణ చట్టం పై అసెంబ్లీలో మరోసారి చర్చ పెట్టడం అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం స్పష్టంగా పేర్కొంది అని రఘునందన్ రావు తెలిపారు.