రేప్లు, ప్రేమ కేసులు పెరిగాయి.. నేరాలు తగ్గాయి: డిజిపి
హైదరాబాద్ : నిరుటితో పోలిస్తే నేరాల సంఖ్య 8 శాతం తగ్గిందని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్శర్మ ప్రకటించారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇక ప్రేమ వ్యవహారాల కేసులు అధికమయ్యాయని చెప్పారు.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయిందని, సైబర్క్రైం పెరిగిందని, వరకట్న హత్యలు పెరిగాయని చెప్పారు. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు షీ టీమ్స్ బాగా పని చేశాయని, 825 మంది ఈవ్టీజర్స్ను అరెస్టు చేశామని, 92 వేల ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు.
ఈ ఏడాది రూ. 88 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ. 48 కోట్ల వరకు రికవరీ చేశామని, ప్రజలతో మరిన్ని సత్సంబంధాలకు ఫేస్బుక్ పేజెస్ పెట్టామని అనురాగ్ శర్మ చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు తీసుకుంటామని, హోంగార్డు నుంచి పైస్థాయి అధికారుల వరకు జవాబుదారీగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది తెలంగాణలో నేరాలు తగ్గాయని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. దోపిడీలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగాయని, మొత్తం మీద శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ చెప్పారు. ట్రాఫికింగ్పై 554 కేసులు నమోదు చేసి 808 మందిని కాపాడామని ఆయన వివరించారు.