మోడీపై నిరసన తెలిపినా కేసీఆర్ అడ్డుకుంటున్నారు; ఇద్దరివీ నాటకాలు: రేవంత్ రెడ్డి ఆరోపణ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ ఇష్టారీతిన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్, మోడీ లు కలిసి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని విమర్శించారు.
విద్యుత్ సౌధ వద్ద ముట్టడిలో తెలంగాణా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్
విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విద్యుత్ సౌధ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కి, మల్లు రవి తదితరులు విద్యుత్ సౌధ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ సౌధ వద్ద నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇచ్చే క్రమంలో ఉద్రిక్తత
అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు లోపలికి వెళుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ లను కలిపి టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయడం లేదని కెసిఆర్ ఆరోపిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ఇక రైతులకు మద్దతుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే కెసిఆర్ గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకమాడుతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Recommended Video
బీజేపీ, టీఆర్ఎస్ లవి జనాల ముందు నాటకాలు
కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి నిన్న రాత్రి పబ్ ల ముందు నిరసన తెలుపుతూ ఆందోళన చేసిన యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినా, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు మిల్లర్ లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు జనాల ముందు నాటకాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.