అంతా ఒక్క కాలనీయే.. 30మంది వెళ్తే: తీరని విషాదం, కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు
గల్లంతయినవారిలో శ్రీవిద్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండగా రోహిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
మెదక్: పండుగపూట సరదాగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన ఇద్దరు యువతుల జీవితాలు విషాదాంతం అయ్యాయి. కార్తీక మాసానికి వరుస సెలవులు కూడా కలిసి రావడంతో స్నేహితులతో కలిసి చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. సమీపంలోని మంజీరా నదిలో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.
ఒకే కాలనీకి చెందిన 30మంది
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఒకే కాలనీకి చెందిన 30 మంది యువతులంతా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. మెదక్ జిల్లా చిట్కుల్ మండలం చిట్కుల్ సమీపంలోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద చాముండేశ్వరి ఆలయం అని చెబతారు.
శ్రీవిద్య, రోహిత గల్లంతు
ఆదివారం ఆలయానికి వెళ్లిన యువతులు సమీపంలోని నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే శ్రీవిద్య(20), రోహిత(18), స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కాళ్లు జారి.. లోతుకు పడిపోయారు. అలా అక్కడినుంచి ముందుకు కొట్టుకుపోయారు.
ఫలించని ప్రయత్నాలు
యువతులు గల్లంతయిన సమయంలో వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలితాన్ని ఇవ్వలేదు. ఫైర్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యమవలేదు.
విలపించిన తల్లిదండ్రులు
గల్లంతయినవారిలో శ్రీవిద్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండగా రోహిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తమ బిడ్డలు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గల్లంతయిన వారికోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.