నాబార్డుతో ఒప్పందం: 'ఎంతో మేలు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం'
హైదరాబాద్: నాబార్డు నిధులతో తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలో పెండింగ్లో ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర జలవనరులశాఖ, నాబార్డు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య భారీ ఒప్పందం కుదిరింది.
మొదటి ప్రాధాన్యంలో 2016-17 నాటికి 23 ప్రాజెక్టులు, రెండో ప్రాధాన్యంలో 2017-18 నాటికి 31 ప్రాజెక్టులు, మూడో ప్రాధాన్యంలో 2019 డిసెంబరు నాటికి 45 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాబార్డుతో ఒప్పందం తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రాష్ర్టానికి చెందిన 11 పెండింగ్ ప్రాజెక్టులతో పాటు మొత్తం 99 ప్రాజెక్టులపై కేంద్రం ఒప్పందం చేసుకుందని తెలిపారు.
మొత్తం 11 ప్రాజెక్టుల కోసం 7 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రెండు వేల కోట్లు గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కోరామని చెప్పారు. సెప్టెంబర్ చివరికల్లా తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
పోతిరెడ్డిపాడు నీటి వినియోగంలో ఏపీ తప్పుడు లెక్కలు చూపిస్తుందని చెప్పిన ఆయన దీనిపై వెంటనే మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి 400 చెరువుల ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తమకు మిషన్ కాకతీయ అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అందాల్సిన సాయాన్ని గుర్తు చేయగా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ట్రిపుల్ ఆర్ కింద నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక కందులు, పెసర వంటి వాటికి మద్దతుదరతోపాటు ఇంటెన్సివ్ కూడా రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
కోల్డ్ స్టోరేజీల కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. తాము రాష్ట్రంలో నిర్మించబోయే గోడౌన్లకు గతంలో ఇచ్చినట్లే సబ్సిడీ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెసలు, కందులు త్వరలోనే కేంద్రం కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.