కరాటే ముసుగులో నిజామాబాద్ లో ఉగ్రవాదశిక్షణ; ఏపీ, తెలంగాణా యువతకు ట్రైనింగ్; పీఎఫ్ఐ ట్రైనర్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాద శిక్షణ చాపకింద నీరులాగా కొనసాగుతుంది అన్న వార్తల నేపథ్యంలో తాజాగా నిజామాబాద్లో చోటుచేసుకున్న ఘటన ఒక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద శిక్షణ కలకలం రేపింది.
నిజామాబాద్ లో ఉగ్రవాద శిక్షణ కలకలం
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లిం యువకులకు భౌతిక దాడులు చేయడానికి, మతపరమైన ఘర్షణలు సృష్టించటానికి , హింసాత్మకమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించిన అబ్దుల్ ఖాదర్ అనే 52 ఏళ్ల వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్త గురించి బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు ఒక టైలర్ తల నరికిన సంఘటనతో దేశంలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్న వేళ తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద శిక్షణ ఆందోళనకు కారణంగా మారింది.
కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద శిక్షణ.. ట్రైనింగ్ భగ్నం చేసిన పోలీసులు
ఉత్తర తెలంగాణ నిజామాబాద్ లోని ఆటోనగర్ లో నివాసం ఉంటున్న ఖాదర్ వివాదాస్పదమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ ఐ సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కరాటే శిక్షణ పేరుతో మతపరమైన దాడులకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్న ఖాదర్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ట్రైనింగ్ ను భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాదు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మారణాయుధాలు, మతపరమైన నిషేదిత సాహిత్యం లభ్యం.. విచారిస్తున్న పోలీసులు
ఆ ఇంట్లో మారణాయుధాలు, నిషేధిత సాహిత్యం, పిఎఫ్ఐ బ్యానర్లు, అనేక బస్సు, రైలు టికెట్లు, భారత దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సాహిత్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి? భౌతిక దాడులు ఎలా చేయాలి? అనేక అంశాలను నేర్పిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జిల్లాలో పిఎఫ్ఐ ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది అన్నదానిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో బోధన్ లో ఉగ్ర కలకలం, తాజాగా ఉగ్ర శిక్షణ, ట్రైనర్ పై కేసు
గతంలోనూ బోధన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగుచూశాయి . మళ్లీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద శిక్షణ కలకలం రేపింది. ఖాదర్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 120A మరియు 120B (నేరపూరిత కుట్ర), మరియు 153A (మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 13 (1) (b) కింద కేసు నమోదు చేయబడింది. ఆపై అతనిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.
ఏపీ, తెలంగాణా నుండి 200మందికి పైగా ఉగ్రవాద శిక్షణ
ఇప్పటివరకు ఖాదర్ వద్ద ఎంతమంది శిక్షణ పొందారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం యువకులను టార్గెట్ చేసి, వారిని మతపరమైన పోరాటయోధులు గా మార్చడానికి, ఉగ్రవాదులు గా తయారు చేయడానికి ఖాదర్ పనిచేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. తెలంగాణా నుండి మాత్రమే కాకుండా ఏపీ నుండి కూడా యువకులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. నిజామాబాద్ లో రెండు వందల మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఇక వారందరినీ గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.