టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం: ఆకట్టుకుంటున్న ప్రాంగణం, కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కొంపల్లిలో 17వ ప్లీనరీ జరుగుతోంది. కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించగా, బస్వరాజు సారయ్య ప్రారంభోపన్యాసం చేసారు. అమరవీరులకు అంజలి ఘటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది నాలుగో ప్లీనరీ.
ప్లీనరీకి దాదాపు తొమ్మిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయి. పెద్ద సభా వేదిక, దానికి ఎడమ వైపు వీఐపీల కార్ పార్కింగ్ వెనుక వైపు వీఐపీల వంట శాల, కుడివైపున కార్యకర్తలకు భోజన ఏర్పాట్ల కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణం మొత్తాన్నీ హెలికాప్టర్ ద్వారా ఫొటోలు తీయగా వాటిని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కార్యకర్తలు, ప్రజలతో పంచుకున్నారు.
Aerial view of TRS Party Plenary venue GBR Cultural Centre at Kompally. #Hyderabad #TRSPlenary2018 pic.twitter.com/3EV4hQIHtk
— TRS Party (@trspartyonline) April 26, 2018
రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ప్లీనరీ వేదిక అవుతుంది. ఇప్పటికే పార్టీ గ్రామ, మండల కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలే అధ్యక్షులుగా ఉంటారు.
ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇంచార్జీలు, ఇతర సీనియర్ నేతలను నియమిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం ఇప్పటికే పునరుద్ఘాటించారు. 2019 ఎన్నికల బృందం ఇప్పటికే ఖరారైంది. ప్లీనరీ వేదికగా వీటన్నింటిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.