గిన్నిస్ రికార్డ్: మహిళలు, యువతుల సెల్ఫ్ డిఫెన్స్!
వరంగల్: హన్మకొండలోని జేఎన్ఎస్ బుధవారం కొత్త రూపును సంతరించుకొంది. వేలాది మంది మహిళలు, యువతులతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా కోలాహలమే కనిపించింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో 'స్వశక్తి' పేరుతో ఆత్మ రక్షణలో మెలకువలపై ఒకరోజు నిర్వహించిన శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభించింది. 21,276మంది యువతులు, మహిళలు పాల్గొని శిక్షణ తీసుకోవడంతో ఈ ప్రదర్శన గిన్నిస్ రికార్డులకెక్కింది.
కాగా, డీజీపీ అనురాగ్శర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ శిక్షకురాలు లక్ష్మి పలు అంశాలను ప్రయోగ పూర్వకంగా వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఇలాంటి వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శిక్షణతో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ధైర్యం వస్తుందన్నారు.
మహిళలను స్ఫూర్తిగా తీసుకొని పోలీసులు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో స్నేహపూర్వకమైన పోలీసింగ్ను కొనసాగిస్తున్నామన్నారు. దీని ద్వారా మంచి ఫలితాలుంటాయన్నారు. పోలీసు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరంగల్కు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక్కడ ఐటీ కంపెనీలను స్థాపించేందుకు విదేశాలను నుంచి ముందుకు వస్తున్నారని చెప్పారు. అందుకే మహిళల భద్రతకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటిది ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఇంత మందిని ఒకే దగ్గర చూడడం గర్వంగా ఉందన్నారు.
జనగామ కలెక్టర్ శ్రీదేవసేన, మహా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రుతి ఓజా, న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి నీలిమ తదితరులు మాట్లాడారు. డీఐజీ రవివర్మ, కేయూ ఉపకులపతి సాయన్న, మహబూబాబాద్ ఎస్పీ మురళీధర్, డీసీపీలు వేణుగోపాల్రావు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసీపీలు ఈశ్వర్రావు, మురళీధర్, జనార్దన్, మహేందర్, సుదీంద్ర, తదితరులు పాల్గొన్నారు.