తిరుమలలో వ్యక్తి దారుణ హత్య; ఉలిక్కిపడ్డ భక్తులు; భద్రతపై అనేక ప్రశ్నలు
కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం మ్యూజియం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు గా గుర్తించారు. ఓ వృద్ధుడితో వాగ్వాదం జరగడంతో సదరు గొడవకు దిగిన వ్యక్తి, వృద్ధుడు నిద్రిస్తున్న సమయంలో వచ్చి బండ రాయితో కొట్టి చంపినట్టుగా అధికారులు గుర్తించారు. అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలో జరిగిన దారుణ హత్య ఆలయ నిర్వాహకుల ముందు అనేక భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు కారణమైంది.
గోవింద నిలయం మ్యూజియం సమీపంలోని వృద్ధుడి దారుణ హత్య
గోవింద నిలయం మ్యూజియం సమీపంలోని సీనియర్ సిటిజన్స్ దర్శన్ ఎంట్రీ పాయింట్ పరిసరాల్లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు ఆలయ అధికారులు. మృతుడు తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె. శరవణగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా తిరుమలలోని ఓ మఠంలో కూలీగా శరవణ పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న శరవణను టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే శరవణ ఆసుపత్రికి వెళ్ళే సరికే మరణించాడు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
మూలాల ప్రకారం, పోలీసులు ఎస్వి మ్యూజియం పరిసరాల నుండి సిసిటివి ఫుటేజీని తీసుకుని దీనిని హత్యగా ధృవీకరించారు . హత్య జరిగిన రెండు గంటల వ్యవధిలోనే అనుమానితుడిని పట్టుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాట్టంకు చెందిన భాస్కర్గా గుర్తించబడిన అనుమానితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హత్య కేసులో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
అత్యంత భద్రత ఉండే తిరుమలలో హత్యతో ఉలిక్కిపడ్డ భక్తులు, భద్రతపై అనేక ప్రశ్నలు
అత్యంత పటిష్టమైన భద్రత ఉండే తిరుమల కొండపై ఇలాంటి దారుణ హత్య జరగటంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేల మంది భద్రతా సిబ్బంది ఉన్న చోటే ఇంతటి దారుణ ఘటన జరగటం తిరుమలలో భద్రత డొల్లతనాన్ని తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి దారుణాలు చోటు చేసుకోకుండా భద్రతను పటిష్టం చెయ్యాలని పలువురు సూచిస్తున్నారు. తిరుమలలో ఇటువంటి ఘటనలు జరగటం భక్తులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్తున్నారు.
గతంలోనూ బాలుడి కిడ్నాప్ ఘటన
ఇక మేనెలలోనూ శ్రీవారి ఆలయం ముందే ఒక బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తిరుపతి దామినేడుకు చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదు సంవత్సరాల బాలుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కిడ్నాప్ కు గురయ్యాడు. సైలెంట్ గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడినుండి వెళ్ళిపోయిన ఘటన చోటు చేసుకుంది.ఇటువంటి ఘటనలు భక్తులలో అభద్రతా భావానికి కారణంగా మారుతున్నాయి.