బెజవాడ దుర్గ గుడి అక్రమాల లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు .. రెండో రోజు సోదాలు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ ఆలయంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఇటీవల ఫిబ్రవరి నెలలో దుర్గగుడికి సంబంధించిన జమ్మిదొడ్డి లోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి దుర్గగుడి పరిపాలనలో అనేక కీలక విభాగాలలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. గతంలో జరిగిన ఏసీబీ తనిఖీల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తాజాగా దుర్గ గుడి అక్రమాలపై నిన్నటి నుంచి విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కనకదుర్గ గుడి వెండి సింహాల మాయం .. బాలకృష్ణ పనే .. కేసును ఛేదించిన పోలీసులు ?
లడ్డు ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు, చీరల విక్రయాల్లో అవకతవకలు
దుర్గగుడి లో బుధవారం నాడు నిర్వహించిన సోదాల్లో విజిలెన్స్ అధికారులు లడ్డు ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, దుర్గమ్మ చీరలు విక్రయాలలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈవో సురేష్ బాబు తన సొంత నిర్ణయంతో అమ్మవారి చీరలు విక్రయించినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు అన్నదాన కాంట్రాక్ట్ లో సైతం అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కనకదుర్గ ఆలయంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారుల సోదాలు గురువారం నాడు, నేడు కూడా కొనసాగుతున్నాయి.
నేడు రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో, టోల్ టికెట్లు, చీరల విభాగాలలో సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. కనక దుర్గ ఆలయానికి సంబంధించిన కీలక విభాగాలను భారీగా అక్రమాలు గుర్తించడంతో ప్రతి ఫైల్ ను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గర్భగుడి కాంట్రాక్టు ఉద్యోగస్తుల బదిలీల వ్యవహారం పై కూడా ఆరా తీస్తున్నారు. కనకదుర్గ ఆలయానికి సంబంధించిన సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్సు ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
అవినీతి అధికారులకు టెన్షన్ .. దుర్గగుడిలో తనిఖీలపై ఏపీలో చర్చ
దుర్గగుడి లో పనిచేస్తున్న కీలక ఉద్యోగస్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఇక తాజా తనిఖీలతో ఇంకా మరెంత మంది అవినీతి అధికారుల గుట్టు రట్టు అవుతుందో వేచి చూడాలి . ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రధానంగా దుర్గగుడి పై ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. ఇక తాజాగా అవినీతి అక్రమాల ఆరోపణలతో, ఏసీబీ , విజిలెన్స్ తనిఖీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గ గుడి పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.