వెంకయ్య నాయుడు, సుజన చౌదరి ప్రోద్బలంతోనే..:
విజయవాడ: ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా చేపట్టిన దాడులు.. కలకలం రేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనానికి కేంద్ర బిందువు అయ్యాయి. ఐటీ దాడులను ఎదుర్కొంటోన్న వ్యక్తులు, సంస్థలకు రాజకీయాలతో సంబంధం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో ఆరంభమైన ఈ ఐటీ అధికారుల దాడులు ఏపీ వరకూ పాకాయి. పలు చోట్ల ముమ్మరంగా సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో వంశీరామ్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కంపెనీ, దాని యజమానుల నివాసాల్లో ఈ తెల్లవారు జామున ఐటీ అధికారులు సోదాలు మొదలయ్యాయి. అనంతరం ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటిపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం 6:30 గంటల నుంచి విజయవాడలోని దేవినేని అవినాష్, ఆయన ముఖ్య అనుచరుల నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి, ఆయన బావమరిది జనార్దన్ రెడ్డి ఐటీ అధికారుల రాడార్లో ఉన్నారు. మొత్తం 18 చోట్ల సోదాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వంశీరామ్ బిల్డర్స్తో వ్యాపార పరమైన సంబంధం ఉండటమే దేవినేని అవినాష్ నివాసంపై దాడులకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ దాడులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కావాల్సి ఉంది. కాగా- దేవినేని అవినాష్ ఇంటిపై ఆదాయాపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారనే విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడ గుణదలలోని నివాసానికి చేరుకున్నారు. దేవినేని అవినాష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ దాడుల వెనుక భారతీయ జనత పార్టీ నాయకులు ప్రమేయం ఉందని దేవినేని అనుచరులు ఆరోపించారు. కేంద్రంలో ఉన్న వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి.. ఇతర నాయకుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన దేవినేని అవినాష్ను రాజకీయంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయించారని ధ్వజమెత్తారు. తమ చేతుల్లో ఉన్న ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగిస్తోన్నారని విమర్శించారు.
2024లో గుడివాడలో గెలవడానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టనున్న టీడీపీ