పేరుకే హెడ్మాస్టర్.. స్టూడెంట్పై జులుం.. అమ్మ ఒడి అడిగితే దాడి..
స్కూల్ డ్రాపవుట్స్ తగ్గించేందుకు ఏపీ సర్కార్ అమ్మఒడి పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు వారి ఖాతాలో జమచేస్తున్నారు. ఈ సారి దానిని ఇంటర్ విద్యార్థులకు కూడా అందజేస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఈ పథకం వల్ల మేలు జరుగుతోంది. వారి చక్కగా చదువుకుంటున్నారు. అయితే విశాఖలో ఓ విద్యార్థికి మాత్రం డబ్బులు జమకాలేదు.
వర్తించని అమ్మ ఒడి..
విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది రూపేశ్ ఎనిమిదో తరగతి చదివాడు. అయితే అతనికి అమ్మ ఒడి పథకం వర్తించలేదు. అమ్మఒడి రాలేదని హెడ్మాస్టర్ను అడిగాడు. అలా అడగడమే తప్పయిపోయింది. ఆ విద్యార్థిని హెడ్మాస్టర్ చితకబాదాడు. వీడియో వైరల్ కావడంతో హెడ్ మాస్టర్ వ్యవహారం వెలుగుచూసింది.
పథకం వర్తించాలని వేడుకోలు
నిరుపేద కుటుంబం కావడంతో అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు శర్మను తల్లిదండ్రులు కలిశారు. సాంకేతిక కారణాలతో సమస్య వచ్చిందని ఆయన చెప్పారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేశారు. ఈ ఏడాది ఏనుగుతుని స్కూల్ కాకుండా నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో రూపేశ్ చేరాడు. అమ్మఒడి పథకం గురించి ఆ స్కూల్ హెడ్మాస్టర్ను అడగగా ఆయన ముందు చదివిన స్కూల్ హెచ్ఎం అప్లోడ్ చేశారా, లేదా తెలుసుకుని రమ్మని చెప్పారు.
అడిగితే.. దాడి
ఏనుగుతుని స్కూల్ హెచ్ఎం శర్మను రూపేశ్ కలిశాడు. అమ్మఒడి గురించి అడగడంతో శర్మ కోపంతో ఊగిపోయాడు. చెంప చెల్లుమనిపించాడు. విద్యార్థిని రోడ్డుపైకి లాక్కొచ్చి ఎంత ధైర్యం అంటూ చితక బాదాడు. దీన్ని స్థానికులు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి ఘటనపై హెడ్ మాస్టర్ శర్మ స్పందించారు. తనతో విద్యార్థి రూపేష్ అమర్యాదగా ప్రవర్తించాడని తెలిపారు. అతని తండ్రి తాగొచ్చి దురుసుగా ప్రవర్తించాడన్నారు. అందుకే మందలించానని చెప్పారు. అమ్మఒడి పథకం బ్యాంకు ఖాతా తప్పుపడడంతో విద్యార్థికి పథకం అందలేదని వివరించారు. ఈ దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు ఇంకా స్పందించలేదు.