రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఆ మూడు జిల్లాల్లో వడగళ్ల వాన
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. వేడి గాలుల ఉధృతి తగ్గింది. ఏపీ తెలంగాణలో ఈ నెల 14వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. మధ్యప్రదేశ్, తీర ప్రాంతం (కొమొరిన్ ఏరియా)లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం వల్ల కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
పగటి ఉష్ణోగ్రత గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ.. సూర్యాస్తమయం తరువాత వాతవరణంలో మార్పులు చోటు చేసుకుంటూ వస్తోంది. వాతావరంన చల్లగా మారుతోంది. సోమవాం మధ్యాహ్నం నుంచే ఈ తరహా పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో నెలకొన్నాయి. విశాఖపట్నం జిల్లా అరకులోయ, ఇతర ఏజెన్సీ గ్రామాల్లో వడగళ్ల వాన పడుతున్నట్లు సమాచారం అందింది. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జంటనగరాలతో పాటు రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి, జగిత్యాల, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో ఈ నెల 14 లేదా 15వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కే నాగరత్న వెల్లడించారు. ఛత్తీస్గఢ్కు ఆనుకుని, మధ్యప్రదేశ్ గగనతలంపై సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడటం వల్ల దాని ప్రభావంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన పడుతుందని పేర్కొన్నారు.