సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీనేత ఆత్మహత్య.. ఎన్నికల ఓటమి, వారి వేధింపులే కారణం!!
వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బిజెపి నేత బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులు, గత ఎన్నికల్లో ఓటమి, అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఇంతకీ వరంగల్ బిజెపి నేత ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఆయనకు కలిగిన అంతటి ఇబ్బంది ఏమిటి? అంటే..
సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీ నేత సూసైడ్
సెల్ఫీ వీడియో తీసుకుని మరీ సూసైడ్ చేసుకున్న బిజెపి నేత గంధం కుమారస్వామి తన సెల్ఫీ వీడియో లో చెప్పిన వివరాల ప్రకారం స్థానిక రాజకీయాలలో యాక్టివ్ గా ఉండే వరంగల్ ఎనుమాములలోని బాలాజీ నగర్ కు చెందిన గంధం కుమారస్వామి వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి రాకపోవడంతో బిజెపి నుంచి పోటీ చేసిన ఆయన గత ఎన్నికలలో ఓడిపోయారు.
ఎన్నికలలో పోటీ చేసిన కుమారస్వామి,వాళ్ళ బెదిరింపులతో సూసైడ్
ఎన్నికల్లో ఖర్చులకోసం ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుండి 25 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్న ఆయన అప్పు తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సాంబేశ్వర్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని, వాళ్లు చంపే కంటే ముందే తానే చనిపోతానని సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నారు గంధం కుమారస్వామి. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుమారస్వామిని ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.
సెల్ఫీ వీడియోలో బీజేపీ నేత చెప్పిన విషయాలివే
ఇక తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలో 2013- 2014 వరకు బాగానే బతికానని, ఆ తర్వాత కోట్ల రూపాయలు వ్యాపారంలో నష్టపోయానని కుమారస్వామి పేర్కొన్నారు. పసుపు వ్యాపారంలో కొంతమంది తనను మోసం చేశారని, తన స్థలాలు, ఇండస్ట్రీలు అమ్ముకోవలసి వచ్చిందని వాపోయారు. తన భార్య పిల్లలను కాపాడుకోవడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై మరింత అప్పులపాలయ్యానని, ఇప్పుడు తనున్న పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక, చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొని గంధం కుమారస్వామి సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం వరంగల్ లో బిజెపి నేత గంధం కుమారస్వామి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.