దళిత కవి కలేకూరి ఇక లేరు
ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్లలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1964 అక్టోబర్ 25వ తేదీన జన్మించిన కలేకూరి ప్రసాద్ కారంచేడులో దళిత వర్గంపై దాడుల ఘటనతో 'యువక'గా గొంతెత్తారు. ఎనిమిదేళ్లపాటు జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో చురుగ్గా పనిచేశారు. పీపుల్స్వార్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి, దళిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. డర్బన్లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు.
ఆయన రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'.. 'భూమికి పచ్చాని రంగేసినట్టూ' 'చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా' తదితర గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన 'హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. అరుంధతీ రాయ్ స్మాల్ ఆఫ్ గాడ్ థింగ్స్ను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు.
తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. కొంతకాలం సబ్ ఎడిటర్గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్తో కలిసి పాల్గొన్నారు. ఇటీవలే ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.