శ్రీలక్ష్మీ నీ మహిమలు..: కోట్లలో పెట్టుబడులు?
కేరళ, తమిళనాడులోని ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులలో శ్రీలక్ష్మి ఏమైనా పెట్టుబడులు పెట్టిందా అనే కోణంలో సిబిఐ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఆధాకాలు లభిస్తే ఓఎంసి కేసు మరో మలుపు తిరుగుతుంది. ఓఎంసి కేసులో సిబిఐచే అరెస్టు కాబడిన శ్రీలక్ష్మి ఆరు నెలలు జైలులో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఇటీవల బెయిల్ పైన బయటకు వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసికి గనులు కేటాయించారనే అభియోగం ఆమెపై ఉంది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు గాలి అనుచరుడు అలీ ఖాన్ను కూడా సిబిఐ అరెస్టు చేసింది. అలీ ఖాన్ అనేక రహస్యాలను సిబిఐ అధికారుల ముందు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఓఎంసికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని చెప్పారని తెలుస్తోంది. దీని ఆధారంగా శ్రీలక్ష్మికి కూడా ముట్టి ఉంటాయని సిబిఐ భావిస్తోందట. ఈ డబ్బును ఇతర రాష్ట్రాలకు మళ్లించి అక్కడ పెట్టుబడులు పెట్టి ఉంటారని అనుమానిస్తోంది.
అలీ ఖాన్ చెప్పిన వివరాల ఆధారంగా శ్రీలక్ష్మి బినామీ ఆస్తుల పైన సిబిఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. బంధువుల పేర్ల మీద పక్క రాష్ట్రాల్లో విద్యుత్తు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న అనుమానంతో ఆయా రాష్ట్రాల నుంచి సిబిఐ అధికారులు వివరాలు తెప్పించుకున్నారట. అక్కడి ప్రయివేటు విద్యుత్ సంస్థలు, వాటిలో భాగస్వాముల వివరాలను, వారి పెట్టుబడులును పరిశీలిస్తున్నారట.