సాయి వివాదం: ఘాటుగా మోహన్ బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: షిర్డీ సాయినాథుడు దేవుడు కాడంటూ ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలకు తాను షాకయినట్లు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్బాబు చెప్పారు. తన దృష్టిలో షిర్డీ సాయి అంటే ఈశ్వరాంశ అనీ, బాబా వల్ల తన జీవితంలో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగాయని తెలిపారు.
షిర్డీ సాయి దేవుడు కాడనీ, ఆయనను పూజించకూడదనీ, ఇది విదేశీ సంస్థల కుట్ర అనీ శంకరాచార్య స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. స్వరూపానంద వ్యాఖ్యలపై మోహన్బాబు ఘాటుగా స్పందించారు.
షిర్డీ సాయిబాబా దేవుడు కాడని, షిర్డీ సాయిబాబాను పూజించవద్దని స్వరూపానంద వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్వరూపానంద వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కాస్తా ఘాటుగానే ప్రతిస్పందించారు.
షిర్డీ సాయిబాబు ఈశ్వరాంశ
తన దృష్టిలో షిర్డీ సాయిబాబా ఈశ్వరాంశ అని, షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని మోహన్ బాబు అన్నారు.
స్వామీజీలంటే వారు..
తన దృష్టిలో స్వామీజీ అంటే ఆకులూ, అలములూ తింటూ, శుచీ శుభ్రత కావాలని కోరుకోకుండా ఉండే వ్యక్తి అనీ, నిరాండబర, నిస్వార్థ జీవి అని మోహన్ బాబు చెప్పారు.
స్వాములంటే వీరు కాదు..
పట్టు పీతాంబరాలు ధరించేవాళ్లూ, సెంట్లు కొట్టుకొనేవాళ్లూ, పిస్తా, బాదం పప్పు తింటూ, ఆవు పాలే తాగే వ్యక్తులూ స్వామీజీలు కారని ఎద్దేవా చేశారు. నిజమైన స్వామీజీలు వారు హిమాలయాల్లోనే ఉంటారని మోహన్ బాబు చెప్పారు.
నమస్కారం చేస్తున్నా..
"షిర్డీ సాయినాథుడిని ఈశ్వర అంశగా తాను భావిస్తాను, నమ్ముతానని, బాబా గుడికి ఎంతోమంది ముస్లిం, క్రైస్తవ, హిందూ సోదరులు వెళ్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆ పెద్దాయనకు నమస్కారం చేస్తున్నానని మోహన్ బాబు అన్నారు.
ఇష్టం లేకపోతే మానేయొచ్చు
"నీకిష్టం లేకపోతే పూజించడం మానేసేయ్. అది నీ స్వవిషయం. కానీ దాన్ని మాకు రుద్దొద్దు. నీ శిష్యులకెవరికైనా రుద్దుకో'' అని స్వామీజీకి మోహన్ బాబు సూచించారు.
అల్లుడిగారు సినిమాతో..
అల్లుడుగారు సినిమాకి ముందు తనకు సక్సెస్లు లేవని, తాను బాబా దగ్గరకెళ్లి, నేనేం తక్కువ? నిర్మాతగా, హీరోగా నాకెందుకు అపజయాలిస్తున్నావు? అని ఆయన్నే ప్రశ్నించానని, ఆ తర్వాత అన్నీ సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలేనని, ఇది నిజమని ఆయన అన్నారు.
బాబా దయతోనే..
'శ్రీరాములయ్య' సినిమా ఓపెనింగ్లో జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో తన తమ్ముడు పరిటాల రవినీ, తననూ కాపాడింది బాబానే అని ఆయన అన్నారు. కాకపోతే కొంతమంది మరణించడం బాధాకరమని అన్నారు.
1985 నుంచి భక్తుడ్ని
దాదాపు 1985వ సంవత్సరం నుంచి షిర్డీసాయి భక్తుడినని, స్వరూపానంద మాటలకు తన మనసు ఆవేదన పడి, బాధపడి ఇది చెప్పాల్సి వస్తోందని మోహన్బాబు చెప్పారు.
పద్ధతి కాదు..
ఎవరి కులాన్ని వారు, ఎవరి మతాన్ని వారు పూజించుకోవచ్చునని, గౌరవించుకోవచ్చనేది తన అభిమతమని ఆయన అన్నారు. ఎదుటి వాడి కులం తక్కువ, నా కులం ఎక్కువ అని చెప్పే అధికారం ఎవరికీ లేదన్నారు. మానవత్వం ఉన్న వాళ్లెవరూ అలా చెప్పరని అన్నారు.
పాదాలకు నమస్కరించాలనిపిస్తోంది...
శంకరాచార్యస్వామి ఫొటో చూస్తే దాదాపు ఎనభై సంవత్సరాలు పైబడిన వయో వృద్ధునిలా కనిపిస్తోందని, ఆయన పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తోందని అన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన వయసుకు, ఆయన పెద్దరికానికి సరికాదని మోహన్ బాబుఅభిప్రాయపడ్డారు.