రాజ్యాంగంలో లేని 'బడ్జెట్', ఎలా తయారీ చేస్తారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట, గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేశారని చెప్పవచ్చు.
అసలు ఈ బడ్జెట్ తయారీ చేస్తారంటే... ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు పంపిస్తారు. నవంబర్ నెలలో వాణిజ్య మండళ్లు, రైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు. ఆ తర్వాత జనవరిలో ఆర్థిక శాఖ మంత్రి వారితో సమావేశమవుతారు.
ప్రణాళికలు రూపొందిస్తారు. ఫిబ్రవరిలో బడ్జెట్తో సంబంధమున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, ముద్రణకు సంబంధించిన సాంకేతిక నిపుణులు.. ఇలా అందర్నీ ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి తరలిస్తారు. వారు అక్కడే ఉండవలసి ఉంటుంది.
ఇతర ప్రపంచంతో వారికి ఇక ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరితోను మాట్లాడే అవకాశముండదు. అంతకుముందే హల్వా వేడుకను నిర్వహిస్తారు. హల్వాను ఆర్థిక మంత్రి అక్కడి వారందరికీ పంచి పెడతారు. ఆర్థిక మంత్రి చేసే ప్రసంగాన్ని రహస్యంగా ఉంచుతారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టే.. రెండు రోజుల ముందు ముద్రణకు ఇస్తారు. ముద్రణ కూడా అక్కడే జరుగుతుంది. వాటిని అధికారులు పూర్తిగా పరిశీలిస్తారు. బడ్జెట్కు సంబంధించిన కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, సర్వర్లతో ఉన్న సంబంధాలను తెంచేస్తారు. సెల్ ఫోన్లు పని చేయకుండా చేస్తారు.
బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యాక.. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది బయటకు వస్తారు. కాగా, బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని నిర్ణయించాక.. సభాపతికి ప్రతిపాదిస్తారు. అక్కడ ఆమోదం లభించాక.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు.
బడ్జెట్ను లోకసభలో సమర్పించాక రాజ్యసభలో దానిని ప్రవేశ పెడతారు. బడ్జెట్ను ప్రవేశ పెట్టిన రోజు ఏ చర్చా జరగదు. ఆ తర్వాత కొన్ని రోజులకు చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా, రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దానిని యానువల్ ఫైనాన్స్ పత్రంగా పేర్కొంటారు.