కెసిఆర్ బస్సుయాత్ర: హైదరాబాద్పై పేచి పెడితే నో
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన నేపథ్యంలో ఇక సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించాలని తెరాస నిర్ణయించుకుంది. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని, సంస్థాగతంగా పటిష్ఠం కావాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని తీర్మానించుకుంది.
తెలంగాణ వచ్చే దాకా ఉద్యమం కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా త్వరలోనే తెలంగాణలో కెసిఆర్ బస్సు యాత్ర జరపాలని చేపట్టనున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఇది మొదలుకానుంది. మెదక్ జిల్లా జగ్దేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులోని తన ఫామ్హౌస్లో ఆదివారం తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో కెసిఆర్ మధ్యాహ్నం సమావేశమయ్యారు. దాదాపు ఐదు గంటలకు పైగా భేటీ జరిగింది.
సమాచారం మేరకు... తెలంగాణ ఉద్యమ నేతలను ఉద్రేకపరచి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేసే కుట్ర జరుగుతోందని కెసిఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తెలంగాణ ఒకవేళ రాకపోతే కుంగిపోవాల్సిన అవసరంలేదని, పార్టీ కేడర్లో మనో ధైర్యం పెంచాలని కెసిఆర్ సూచించారు.
ఇటీవల వెలువడ్డ సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, వాటిని నిలబెట్టుకునే విధంగా సంస్థాగతంగా బలోపేతం కావాలని సూచించారు. తెలంగాణ ప్రకటనపై సంబరాలు అక్కర్లేదని పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితేనే తెలంగాణ వచ్చినట్లు లెక్క అని కెసిఆర్ తెలిపారు. తెలంగాణను ప్రకటించినందున తమ పార్టీని విలీనం చేయాలని బయటికి చెబుతూనే, ఐకాసనేతలను దగ్గర చేసుకుంటూ, వలసలను ప్రోత్సహిస్తూ తెరాసను బలహీనపర్చాలని కాంగ్రెస్ చూస్తోందని తెరాస అగ్రనాయకత్వం భావిస్తోంది.
కాగా, కెసిఆర్తో సమావేశం అనంతరం తెరాస నేతలు కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో మెలిక పెడితే ఒప్పుకోబోమని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్పై పేచీ పెడితే తెలంగాణ ప్రాంతం రణరంగమే అవుతుందని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని, అవసరమైతే సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంపై ప్రజలు ఉత్కంఠగా ఉన్నారని, హైదరాబాద్ ప్రజలు రోడ్లపైకి రావటానికి సిద్ధంగా ఉన్నారని, హైదరాబాద్ నగరవాసులతో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం వికృత రూపం దాల్చిందని వారు మండిపడ్డారు.
ఉద్యమానికి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, భౌతికదాడులకు దిగి శాంతియుత వాతావరణాన్ని చెడగొడితే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తమను రెచ్చగొట్టి, హైదరాబాద్లోని ఆంధ్రోళ్లపై దాడులకు ఉసిగొల్పి తెలంగాణ రాకుండా చేయాలని సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో సోనియా గాంధీ బొమ్మలను చెప్పులతో కొడుతుంటే సిఎం, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.