ఛోటా రాజన్: పేరు చెప్పి చిక్కిపోయాడు
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చిన్న పొరపాటుకు ఇప్పుడు జైలు గోడల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. చిన్న పొరపాటుతో ఎంతటి కరుడు గట్టిన మాఫియా డాన్ అయినా దొరికిపోతాడని ఛోటా రాజన్ ఉదంతం తెలియజేస్తోంది. పాస్పోర్టులో ఒక పేరు, అధికారులకు చెప్పింది మరో పేరు కావడంతో ఈ మాఫియా డాన్ కథకు తెరపడింది.
బాలి విమానాశ్రయంలో క్యూలో వున్న రాజన్ను ‘నీ పేరేమిటి' అని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడగడం, అతను ఏమాత్రం ఆలోచించకుండా తన అసలు పేరు చెప్పేయడంతో దొరికిపోయాడు. అప్పటికప్పుడే రాజన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలి విమానాశ్రయంలో అందరితోపాటే రాజన్కూడా క్యూలో నించున్నాడు.
అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమానం రావడంతో అతన్ని ఆ క్యూ నుంచి బయటకు పిలిచి పేరు అడిగారు. తన పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అని వెల్లడించాడు. కానీ పాస్పోర్టులో అతని పేరు మోహన్ కుమార్. దాంతో అధికారుల అనుమానం బలపడింది. అతన్ని ఛోటా రాజన్గా గుర్తించి అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.
ఎప్పుడైతే ఛోటా రాజన్ను అదుపులోకి తీసుకున్నారో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది అతని పేరునే అన్న విషయాన్ని ఇండోనేషియా అధికారులు ధ్రువీకరించుకున్నారు. అప్పట్నుంచి మొత్తం ఛోటా రాజన్ను గుర్తించే ప్రక్రియలు చేపట్టారు.
రెడ్ కార్నర్ నోటీసులో పేర్కొన్న 18 గుర్తుల్లో 11 గుర్తులు సరిపోయాయని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఓ చిన్న తప్పిదమే గత 22 సంవత్సరాలుగా భారత్ను తప్పించుకు తిరుగుతున్న ఛోటా రాజన్ అరెస్టుకు అతడు స్వదేశానికి చేరడానికి కారణమైంది.