అవమానం: రాజీనామాకు సిద్ధపడిన చిన రాజప్ప, బాబు బుజ్జగింపు
Recommended Video
అమరావతి: తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న తనకే తన శాఖ నుంచి అవమానం ఎదురు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్లు చెబుతున్నారు.
పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్కు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిన తీరుపై కినుక వహించి ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన రాజీనామాకు కూడా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
అలిగి బహిష్కరించడమే కాకుండా..
తనకు జరిగిన అవమానానికి అలిగి, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడమే కాకుండా గౌరవం లేని పదవిలో ఎందుకు ఉండడమనే బాధతో రాజీనామా చేసే వరకు వెళ్లినట్లు సమాచారం. గురువారం తుళ్లూరులో జరిగిన ఫొరెన్సిక్ ల్యాబ్ కేంద్రానికి శంకుస్థాపనకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చారు.
చిన రాజప్పకు ఆహ్వానం ఇలా..
ఆ కార్యక్రమం ముందుగానే ఖరారైనప్పటికీ సంబంధిత హోం శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ప్రభుత్వ శాఖ నుంచి లేదా డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ ద్వారా పోలీసు శాఖ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
కార్యక్రమానికి వెళ్లకుండా తిరుపతికి..
చంద్రబాబు వస్తారని తెలిసి కూడా కార్యక్రమానికి వెళ్లకుండా చిన రాజప్ప తిరుపతికి వెళ్లిపోయారు. ఆ రకంగా తన నిరసనను వ్యక్తం చేశారు. దానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయడానికీ సిద్ధపడినట్లు సమాచారం. తన శాఖకు సంబంధించిన వారే తనకు మర్యాద ఇవ్వనప్పుడు ఆ పదవిలో కొనసాగడం వృధా అని ఆయన భావించినట్లు చెబుతున్నారు.
ఆ విషయం చంద్రబాబుకు చెప్పేశారు...
తాను రాజీనామా చేయాలని అనుకుంంటున్న విషయాన్ని చినరాజప్ప స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఆయనను వారించి తాను పోలీసులతో మాట్లాడతానని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయినా కూడా ఆయన తిరుపతి వెళ్లిపోయారు.
రాష్ట్రపతి కార్యక్రమానికి కూడా..
తమ పట్ల సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్టప్రతి పర్యటనలో కూడా చివరి నిమిషంలో ఫోన్లు చేసి హాజరు కావాలని కోరారని అంటున్నారు. ఇటువంటి తీరుపై మంత్రులు, శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.