చిన్న పార్టీలతో కాదు: బాబు
హైదరాబాద్కు తాము అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్నో మురికికూపంగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉండగా కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తే ఆ నీటిని కూడా సరిగా పంపిణీ చేసే పరిస్థితిలో కూడా వైఎస్ సర్కార్ లేదని విమర్శించారు. భోలక్పూర్లో కలుషిత నీటిని సరఫరా చేసి ప్రాణాలు బలిగొన్నారన్నారు. ఆఖరికి చెత్త రవాణా కాంట్రాక్టులోనూ ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "హైదరాబాద్ చుట్టూ 200పైగా ఇంజనీరింగ్ కళాశాలలు మా హయాంలోనే వచ్చాయి. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి 27లక్షలమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం వాటికి గ్యాస్ సరఫరా చేయలేకపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దళారుల దోపిడీ పెచ్చుమీరిపోయింది" అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగర శివార్లు తెదేపాకు కంచుకోటగా ఉండేవి మొన్నటి ఎన్నికల్లో కొన్ని లోటుపాట్ల వల్ల ఓడిపోయామన్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట మాజీ ఎంపీ, మాజీ మంత్రి మల్యాల రాజయ్య శుక్రవారమిక్కడ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికలకు ముందు ప్రరాపాలో చేరిన ఆయన.. అక్కడినుంచి ఇప్పుడు తెదేపాలోకి వచ్చారు.