తెలంగాణపై మళ్లీ దద్దరిల్లిన పార్లమెంటు
లోకసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. బిజెపి, వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ, శివసేన అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. నలుగురు తెలుగుదేశం సభ్యులు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించగా, ఒక సభ్యుడు జై తెలంగాన నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. కొంత మంది కాంగ్రెసు సభ్యులు కూడా జై తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు.
తెలంగాణ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు ఎంవి మైసురారెడ్డి, నందమూరి హరికృష్ణ రాజ్యసభలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరగకూడదని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కొంత మంది కాంగ్రెసు సభ్యులు వారికి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో సభ 30 నిమిషాలు వాయిదా పడింది.