పథకం ప్రకారమే మిలియన్ మార్చ్లో ట్యాంక్బండ్ విగ్రహాల ధ్వంసం
ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు.