జుడాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కఠినచర్యలు: కొండ్రు
గ్రామీణ ప్రాంతాల్లో సేవల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదన్నారు. వారి తీరు మారకుంటే వారి సర్టిఫికేట్లు రద్దు చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. అయితే వారు భవిష్యత్తు కోల్పోతారనే ఉద్దేశ్యంతోనే తాము నిరీక్షిస్తున్నామని.. తప్పని పరిస్థితి వస్తే చర్యలకు మాత్రం వెనుకాడబోమన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా తాను మాట్లాడినట్లు కొండ్రు మురళి చెప్పారు.
కాగా ఏమాత్రం దారికి రాని జూనియర్ డాక్టర్లపై ఎస్మాస్త్రం సంధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తోంది. మంగళవారం రాత్రి జూడాలు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అటు ప్రభుత్వం, ఇటు జూడాలు ఎవరి వాదన వారు వినిపించారు. జూడాల ప్రతినిధులు ఆదిత్య, అభిలాష్, జగదీశ్, నరేశ్ తదితరులతో వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్, వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ విష్ణు ప్రసాద్ చర్చలు జరిపారు.
ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో సమ్మెపై పీటముడి వీడలేదు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చేదాకా సమ్మె విరమించలేదని జూడాలు... 16 ప్రతిపాదనలకు అంగీకరించినప్పటికీ మళ్లీ సమ్మె చేస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో సమ్మె సరికాదని నచ్చజెప్పామని, అయినా వినడం లేదని, జూడాలు చిన్నవాళ్లయినప్పటికీ పెద్ద సందేహాలు లేవదీస్తున్నారన్నారు. 60 శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉంటున్నారని, డాక్టర్లు అవుతున్నవారిలోనూ 60 శాతం మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్లే అన్నారు.
అయినా గ్రామాల్లో పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని, ఏది ఏమైనా... ఎంబిబిఎస్, పిజి పూర్తయ్యాక ఒక సంవత్సరం కచ్చితంగా రూరల్ సర్వీస్ చేయాల్సిందేనని రత్నకిశోర్, విష్ణు స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్ష జీతం ఇస్తున్నారన్న వాదనపై స్పందిస్తూ... వ్యాపారకోణంలో కాదని, మానవీయ కోణంలో చూడాలని వారికి చెప్పామని అధికారులు వెల్లడించారు. బాండ్లలో చెప్పిన ప్రకారం రూరల్ సర్వీస్ చేయనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చర్చలు జరిగిన ప్రతీసారీ ఏదో ఒక వంకతో బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పేదల సొమ్ముతో చదువుకుని వారికే సేవలు చేయరా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. మెట్టు దిగిరానిపక్షంలో ఎస్మా ప్రయోగించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. సమ్మె పేరిట అత్యవసర సేవలను కూడా నిలిపివేసిన నేపథ్యంలో... ప్రజలకు ఇబ్బంది కలుగకుండా 600 నుంచి 800 మంది డాక్టర్లను నియమించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో హైకోర్టులో బుధవారం కౌంటర్ వేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తమను భయపెట్టేందుకే అధికారులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.