ఏపీలో కరోనా కల్లోలం.. 6 వేలకు పాజిటివ్ కేసులు,, 22 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్ అల్లాడిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో ఏీలో 6 వేలకు పైగా కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా తప్ప మిగతా జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. కరోనా కేసులు పెరగడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ఏపీలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. చిత్తూరు జిల్లాలో మరోసారి వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582 మందికి పాజిటివ్ వచ్చింది. చిత్తూరు జిల్లాలో 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు గుర్తించారు.
2,343 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా, 22 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,62,037 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,09,941 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 44,686 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,410కి పెరిగింది.