మాట తప్పిన బాబు సర్కార్: జనం ప్రశ్నిస్తున్నారు! పవన్ పోరాటానికి రెడీనా?
జనం డిమాండ్ సరే కానీ జనసేనాని మరోసారి వారికి మద్దతుగా నిలబడుతారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
అమరావతి: జనం నుంచి ప్రతిఘటన ఎదురవగానే తాత్కాళికంగా వెనకడుగేయడం.. ఆపై అంతా సర్దుమణిగింది అనుకున్నాక.. తన పని తాను కానిచ్చేయడం ప్రభుత్వాలకు అలవాటే. భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు కూడా ఇదే విషయాన్ని తలపిస్తోంది.
ఏడాది క్రితం కురగల్లు, నవులూరు, పెనుమాక తదితర గ్రామాల్లో భూసేకరణకు ప్రయత్నించి.. ఆపై జనం నుంచి ప్రతిఘటన ఎదురవగానే వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి భూసేకరణకు సిద్దమవుతోంది. కురగల్లులోని 185 ఎకరాలను, నవులూరులో 152 ఎకరాలను సేకరించడానికి భూసేకరణ చట్టం 2013నోటిఫికేషన్ ను నేడు ప్రభుత్వం విడుదల చేసింది.
దీంతో అక్కడి ప్రాంత ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అదే సమయంలో వారి చూపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పడింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వారికి అండగా నిలబడటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో మరోసారి తమ కోసం పవన్ కళ్యాణ్ రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ పోరాటానికి పవన్ కళ్యాణ్ ముందుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
జనం డిమాండ్ సరే కానీ జనసేనాని మరోసారి వారికి మద్దతుగా నిలబడుతారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. గతంలో చెప్పినట్లు మెతగ్గా కాకుండా ఈసారైనా ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారా? లేక వచ్చామా! పోయామా! అన్నట్లు ఏదో వాళ్ల తరుపున నాలుగు మాటలు మాట్లాడి ముగిస్తారా? అన్నది వేచి చూడాలి.