ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలి .. కోర్టు తీర్పుతో చురకలంటించిన అశోక్ గజపతిరాజు
మాన్సాస్,సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత నియామక జీవోను హైకోర్టు కొట్టివేయడం పై అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవించాలని కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇప్పటివరకు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూడాలి
అశోక్ గజపతిరాజును మాన్సాస్ , సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ గా పునర్నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విజయనగరంలో మీడియాతో మాట్లాడిన అశోక్ గజపతిరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని ఇబ్బంది పెట్టడం కోసం ఉద్యోగులు, సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు.వివాదం జరిగి చాలా రోజులు అయింది అని పేర్కొన్న అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూడవలసి ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం తనకు ఎంత మేరకు సహకరిస్తుంది అనేది చూడాలి
సింహాచలం ట్రస్ట్ పరిధిలోని ఆలయాలలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తనను అనేక విధాలుగా అవమానించారని, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం తనకు ఎంత మేరకు సహకరిస్తుంది అనేది చూడాలని ఆయన పేర్కొన్నారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . మాన్సాస్ ప్రజల కోసం పుట్టిన సంస్థ అని తెలిసినప్పటికీ తనపై పగతో దానిని తరలించారని ఆయన ఆక్షేపించారు.

అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి
తాను చైర్మన్ గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, కానీ వాటిని నిరూపించ లేకపోయారు అంటూ ఎక్కడ నష్టం జరిగిందో చూపించలేకపోయారు అంటూ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. రామతీర్థం ఆలయానికి తాను విరాళం ఇస్తే పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని చేసినా ధర్మమే గెలిచిందని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications