గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ...
గుంటూరు జిల్లా: వైసిపి అధినేత జగన్ పాదయాత్ర నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 116వ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రకు హాజరైన స్థానిక వైసిపి కార్యకర్తలు ప్రజాసంకల్పయాత్ర తమ ప్రాంతంలో ముగిసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి తిరిగివెళుతున్నారు. ఈ క్రమంలో కొప్పర్రులో మైకులు పెట్టుకుని మా కాలనీలోకి ఎందుకు వచ్చారంటూ టీడీపీ మైనారిటీ నేతలు వీరిని అడ్డుకున్నారు.
దీంతో ఈ విషయమై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో టిడిపి వర్గీయులు ఒక వైసిపి కార్యకర్తపై దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి ఇరువర్గాలకు సర్థిచెప్పి... కొప్పర్రు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్నజగన్ పాదయాత్ర మంగళవారం ఉదయం పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుండి రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదగా ఉప్పలపాడు వరకూ జగన్ 116 వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది.