జగన్ దీక్ష అవకాశవాదం: డిగ్గీ, కోర్టుకెళ్తా: జగన్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రారంభించిన నిరవధిక నిరాహారదీక్షపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. జగన్ దీక్షపై ఆయన మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో శనివారం ప్రతిస్పందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగన్ తెలంగాణపై మాట మార్చడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగన్, చంద్రబాబు తెలంగాణకు రాతపూర్వకంగా మద్దతు తెలిపారని, ఆశ్చర్యకరంగా రాజకీయ అవకాశవాదానికి పాల్పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు.
తెలంగాణపై మంత్రివర్గాన్ని నిర్ణయాన్ని తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని వైయస్ జగన్ చెప్పారు. ఈ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. ఆర్డినెన్స్ను ఉపసంహరించుకున్నప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోరని ఆయన అడిగారు.
జగన్ దీక్షకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. తెలంగాణవాదుల నుంచి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
విభజన సమస్యలను ఆరు వారాల్లో మంత్రుల బృందం ఎలా పరిష్కరిస్తుందని ఆయన అడిగారు. అధికారం ఉంది కదా అని కేంద్రం నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన విమర్శించారు. విభజనపై అసెంబ్లీ తీర్మాన సంప్రదయాన్ని గాలికి వదిలేశారా అని అడిగారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు వెంటనే లేఖ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.