మోడీ ప్రమోషన్ ఇస్తారేమో: దిగ్విజయ్, భారీ స్కాం అని కేసీఆర్పై
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురవారం మండిపడ్డారు. ఆయన ఉదయం తెలంగాణ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీని వ్యతిరేకించే వారు పాకిస్తాన్కు వెళ్లాలని గతంలో వ్యాఖ్యానించినా గిరిరాజ్ పైన చర్యలు తీసుకోలేదని, పైగా మంత్రి పదవి ఇచ్చారన్నారు.
ఇప్పుడు కూడా మోడీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. తాము అందరినీ ఒప్పించి భూసేకరణ బిల్లు తీసుకు వస్తే, బీజేపీ దానిని బుల్డోజ్ చేయాలనుకుంటోందన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలకు మాత్రమే అచ్చేదిన్ అని, సామాన్యులకు రాలేదన్నారు.
రైతులకు మద్దతుగా ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో ర్యాలీ ఉంటుందని, అందులో రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్న తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అటకెక్కించిందన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టలీ వంటివి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలని, అవి అమలు కావడం లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏపీలో కూడా అమలు కావడం లేదన్నారు. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ 50 లక్షల సంతకాలను ఏపీపీసీసీ సేకరించిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రమిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్కు ఆడంబరాలు, ఆర్భాటాల పైనే ఆసక్తి అన్నారు. వాటర్ గ్రిడ్ స్కీముతో ప్రజలకు ఒరిగేదేం లేదని, కేవలం పైప్ కంపెనీలకు మేలు చేయడమే అన్నారు. ఇది మరో భారీ కుంభకోణం కాబోతుందన్నారు.
కేసీఆర్ పైన రావుల నిప్పులు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రివర్గంలో కారు, సైకిల్, ఏనుగు గుర్తుల పైన గెలిచిన వారున్నారని, పార్టీ ఫిరాయింపుల చట్టం తెలంగాణకు వర్తించదా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వేరుగా ప్రశ్నించారు.
కేసీఆర్ది ఆల్పార్టీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమంటే ధనికుల కోసం పని చేయడమా అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు అనుకూలంగా ఉంటేనే పెద్దలు, విజ్ఞులని కేసీఆర్ పొగుడుతారని, లేకుంటే విమర్శిస్తారన్నారు.
జాతీయ గీతాలాపనలో తప్పు జరిగి ఉంటే క్షమాపణ కోరుతూ తాము లేఖలు ఇచ్చామన్నారు. ప్రజా సమస్యల పైన తాము నిలదీస్తామనే కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ మంత్రివర్గం విచిత్రమైందన్నారు.