తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం: వీడియో వైరల్, టీటీడీ ఏమందంటే.?
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియాలో కనిపించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు.
విమానాలను కూడా శ్రీవారి ఆలయం వైపునకు వెళ్లకుండా చూడాలని గతంలోనే విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంపై డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. డ్రోన్ తో చిత్రీకరించినా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు.
శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతర భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్ చిత్రీకరించకపోవడం గమనార్హం. అంతేగాక, తిరుమల వ్యాపత్ంగా 1600కుపైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అందులోనూ ఈ డ్రోన్ వ్యవహారం అందులో కూడా బయటపడలేదు.
ఇది ఇలావుండగా, శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.
తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఈ వీడియో అసలైందా అని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. .