ఫాస్ట్పై కెసిఆర్ మల్లగుల్లాలు: కౌంటర్కు ఆదేశం
హైదరాబాద్: ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ(ఫాస్ట్)పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించాయి. దీనిపై తదుపరి అడుగు ఎలా వేయాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కాగా, ఫాస్ట్ పథకంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్దేశ్యానికి భిన్నంగా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని, అసలు ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేయాలని భావిస్తుందో హైకోర్టుకు వివరించాలని ఆయన న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు న్యాయశాఖ అధికారులు ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
1956 నవంబర్ 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు మాత్రమే ‘ఫాస్ట్'ను వర్తింపజేయాలనే లక్ష్యంతో మార్గదర్శకాలు సిద్ధం చేయడానికి కమిటీ వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం.36పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది. నిజానికి దీనికి సంబంధించిన మార్గదర్శకాల ఫైలు సీఎం పేషికి వారం రోజుల కిందటే చేరింది.
బడ్జెట్ సమావేశాల తర్వాత జీవో జారీ చేయాలని ప్రభుత్వం యోచించింది. తాజాగా హైకోర్ట్ ఆగ్రహం నేపథ్యంలో ఆ జీవో కూడా జారీ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని ప్రభుత్వం కలవరపడింది. అయితే, ఈ వ్యాజ్యం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
మూడువారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థుల స్థానికతపై జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాషా్ట్రలతోపాటు సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పులను అధ్యయనం చేసేపనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కౌంటర్ దాఖలులో కూడా ఈ అంశాలను పొందుపరిచే అవకాశాలున్నాయి.