రాష్ట్రపతి పాలనకు కుట్ర, ఎవరో తెలుసు: లగడపాటి
శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే సమైక్యాంధ్ర ప్రభుత్వం కూలిపోతుందని, అలా ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన వచ్చేలా చూడాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. సమైక్య ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కొంత మంది కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ మ్యానిఫెస్టో రోశయ్య కమిటీయేనని ఆయన అన్నారు. శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తే సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎంత కడుపు మంట ఉందో ఈ రోజు అందరికీ తెలిసి వచ్చిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. నీళ్లు, ఉద్యోగాల సమస్యల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికన్నా మించిన సమైక్యవాది మరొకరు లేరని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చెప్పారని, తెలుగుజాతికి చీడ పురుగులు ముఖ్యమంత్రిని తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రయత్నాలు చేసేవారంతా వేర్పాటువాదులేనని ఆయన అన్నారు.
ప్రజలతో మమైకమై సమైక్యాంధ్ర ఉద్యమం చేయడానికే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయం వచ్చినప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో దిగ్విజయ్ సింగ్ను తప్పు దోవ పట్టించారని ఆయన అన్నారు. విభజనకు నిర్ణయం తీసుకుంటే ప్రతి జిల్లా భగ్గుమంటుందని చిరంజీవి దిగ్విజయ్ సింగ్కు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.