ఆ తర్వాత మాట్లాడుతా: టీఆర్ఎస్ గెలుపుపై లగడపాటి డౌట్స్, ఏపీ-పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా..
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రీ పోల్ సర్వేలో వచ్చిన ఫలితాలు ఎందుకు కనిపించలేదో తాను 2019 లోకసభ ఎన్నికల తర్వాత పోల్చుకొని ప్రశ్నిస్తానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం అన్నారు. ఆయన ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమవి దొంగ సర్వేలు, కొందరి ప్రోద్భలంతో చేసినవి అని చెప్పడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష బాగా పుంజుకుందని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో (అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు) ఇంత తేడానా అని ప్రశ్నించారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసన
ఆ తర్వాతే తెలంగాణ ఎన్నికలపై మాట్లాడుతా
రాబోయే లోకసభ ఎన్నికలకు ముందు తాను తమ ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెప్పనని, ఆ ఎన్నికలు జరిగాక తాను తమ సర్వే ఫలితాలు చెబుతానని, అప్పుడు తనవి కరెక్ట్ అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్వే ఎందుకు తప్పయిందో కారణాలు చెబుతానని అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎందుకు తారుమారు అయ్యాయో, తాను చెప్పిన ఇండిపెండెంట్లు ఎందుకు రెండో స్థానంలో నిలిచారో చెబుతానని అన్నారు.
ఎవరి ప్రోద్భలం లేదు
అసలు తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీపోల్ సర్వే ఫలితాలు చెప్పలేదని, తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగితేనే తాను చెప్పానని, అప్పుడే తనపై విమర్శలు వచ్చాయన్నారు. తాము ఎవరి ప్రోద్బలంతో నడిచే వ్యక్తిని కాదని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్వే ఫలితాల వెనుక ఎవరూ లేరని చెప్పారు. తనకు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కేసీఆర్లతో ఒకటేరకమైన సందర్భాలు ఉన్నాయన్నారు.
ఇన్ని అనుమానాలు లేవనెత్తిన లగడపాటి
అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోలింగ్ శాతం చెప్పడానికే రెండు రోజులు ఎందుకు పట్టిందని లగడపాటి ప్రశ్నించారు. అసలు వాటిని పోలింగ్ ముగిసిన తర్వాతే ప్రకటించాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో వచ్చిన అనుమనాలపై ఈసీ నివృత్తి చేయాలని చెప్పారు. మొత్తం ఓట్ల కంటే అధికార పార్టీకి పోలైన ఓట్లు కొన్ని స్థానాల్లో వచ్చాయని, అవి ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో డబ్బు ప్రభావం చూపిందని చెప్పానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షం మంచి సీట్లు గెలుచుకుందని, నెల రోజుల వ్యవధిలోనే ఇంత తేడానా అన్నారు. తెలంగాణలో పోలింగ్ శాతం పెరగడంపై కొందరిలో అనుమానం ఉందని చెప్పారు. వీవీప్యాట్లు లెక్కించాలని చాలామంది అభ్యర్థులు అడిగారని చెప్పారు.
సిద్ధాంతానికి కట్టుబడి గుడ్ బై చెప్పా
తమ సర్వేలపై సమగ్రంగా విచారణ జరిపించామని లగడపాటి చెప్పారు. తన ఫలితాలు తప్పయినా, సరైనా తాను పట్టించుకునే వ్యక్తిని కాదని చెప్పారు. కానీ ఎవరో చెబితే పలికే చిలుక అని చెప్పినందుకు తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. తాను ఎవరి ఒత్తిడికి లొంగని వ్యక్తిని అన్నారు. తన వ్యక్తిత్వంపై మచ్చ వేసే ప్రయత్నాలు చేయడమే తనకు బాధించిందని చెప్పారు. సిద్ధాంతానికి కట్టుబడి తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు.
నేను చిలుకను కాను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్వేల తప్పుకావడం చూసి మొదటిసారి ఆశ్చర్యపోయానని లగడపాటి చెప్పారు. గతంలో తమ సర్వేలు నిజం అయ్యాయని చెప్పారు. తాను చిలక జోస్యాలు చెప్పనని, రాజకీయ లబ్ధి చూసుకోనని చెప్పారు. గతంలో తమ సర్వేలు పెద్దగా తప్పయింది లేదని చెప్పారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం బాగా పెరిగిందని చెప్పారు.
ఏపీ రాజకీయాలు, పవన్ ప్రభావంపై అడగగా..
ఏపీ రాజకీయాల గురించి జర్నలిస్టులు పదేపదే ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి అనుకూలమని, ఎలా ఉంటుందని, జనసేన ప్రభావం ఎలా ఉంటుందని అడగగా.. తాను ఇప్పుడే ఏమీ చెప్పనని లగడపాటి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రాగద్వేషాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారని చెప్పారు.