ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన: ఈ జిల్లాలు అలర్ట్
అమరావతి: వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, కోస్తాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణం. దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి.
సముద్రమట్ట నుంచి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం విస్తరించిందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దీని ప్రభావం వల్ల వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, కాకినాడ, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, విజయనగరం, పార్వతిపురం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.
దీని ప్రభావం రాయలసీమలోని నంద్యాల, కర్నూలు జిల్లాలపైనా ఉంటుందని పేర్కొన్నారు. జార్ఖండ్ నుంచి మధ్యప్రదేశ్, ఒడిశా మీదుగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని వివరించారు. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మున్ముందు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. దీనికితోడు అరేబియా సముద్రం నుంచి వీస్తోన్న బలమైన గాలులు రుతుపవనాల విస్తరణకు కారణం అయ్యాయని వివరించారు.
ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఇప్పటికే ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. అటు హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మౌలాలి, కాప్రా, సైనిక్పురిల్లో అత్యధిక వర్షాపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల పాటు ఇవే తరహా పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొని ఉంటాయని పేర్కొన్నారు.